భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రాజలింగమూర్తి సహకరించిన వారే హత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. అందుకు కారణం భూ వివాదమని అంటున్నారు. ఈ హత్యలో పాల్గొన్న నలుగురిలో.. ఇప్పటికే పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.
భూవివాదం నేపథ్యంలోనే తన భర్త హత్య జరిగినట్లు రాజలింగమూర్తి భార్య సరళ ఫిర్యాదు చేశారని.. భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు వివరించారు. పింగిలి శ్రీమంత్, రేణుకుంట్ల సంజీవ్, మోరే కుమార్, కొత్తూరు కుమార్, రేణుకుంట్ల కొమరయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే.. హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అదుపులో ఉన్న నిందితుల సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
భూపాలపల్లి టౌన్లో పోలీస్ స్టేషన్ ఉంది. దీనిక ఎదురుగా 319 సర్వే నంబరులో 2.25 ఎకరాల భూమి ఉంది. అందులోని ఒక ఎకరాన్ని సింగరేణి యాజమాన్యం రోడ్డు నిర్మాణానికి సేకరించింది. మిగిలిన 1.25 ఎకరాల గురించి బుర్ర చంద్రయ్య-రేణుకుంట్ల కొమరయ్య మధ్య వివాదం నడుస్తోంది. దీనికోసం ఓ లాయర్తో కేసు వేయించారు. 1.25 ఎకరాలను కోర్టు ద్వారా రేణుకుంట్ల కొమరయ్యకు వచ్చేలా రాజలింగమూర్తి పనిచేశారు.
లాయర్ ఫీజు కింద 6 గుంటల భూమిని ఇచ్చేందుకు కొమరయ్య ఒప్పుకున్నారని.. అందులో 4 గుంటలు లాయర్ భార్య పేరిట, 2 గుంటలు రాజలింగమూర్తి భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 6 గుంటలు కాకుండా.. ఖాళీగా ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొమరయ్య కుటుంబ సభ్యులు చాలాసార్లు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో.. తన భార్య పేరిట ఉన్న స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. 6 నెలల కిందట రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఈ నెల 20న గురువారం భూపాలపల్లి సబ్ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ బుధవారం రాత్రే ఈ హత్య జరిగింది. పిటిషనర్ మృతితో కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ వివాదం కారణంగానే రాజలింగమూర్తిని కొమరయ్య కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.