ఆ అధికారి పేరు అర్రామ్ రెడ్డి అమరేందర్. సిరిసిల్ల ఇరిగేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. తాజాగా ఆయన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుబడిన తర్వాత కూడా అతను దర్జాగా సోఫాలో కూర్చొని కనిపించాడు. అతని వ్యవహార శైలిని చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సదరు అధికారి ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మే 9వ తేదీ.. సమయం రాత్రి 8 గంటలు. ప్రాంతం కరీంనగర్ లోని విద్యారణ్యపురి. అది ఓ అవినీతి అధికారి ఇల్లు. ఆ ఇంట్లో అవినీతి ఆఫీసర్ ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 60,000 లంచం తీసుకున్నాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన ఏసీబీ అధికారులు.. రంగంలోకి దిగారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రాజన్న సిరిసిల్లలోని వెంకటాపూర్ మండలంలోని అవునూరు, అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ను నిర్మించారు. దీనికి సంబంధించిన పెండింగ్లో ఉన్న రూ. 50 లక్షల బిల్లును మంజూరు చేయడానికి.. డీఈఈ అమరేందర్ లంచం డిమాండ్ చేశారు. అయితే.. ఇది దాదాపు ఒక సంవత్సరం కిందట పూర్తయిన ప్రాజెక్ట్. దానికోసం కూడా లంచం డిమాండ్ చేయడంతో.. కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు.
లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు డీఈఈ అమరేందర్. లంచం నగదును తన కొడుకు టీ-షర్టులో పెట్టి కాంపౌండ్ గోడపైకి విసిరేశాడు. అయితే ఏసీబీ అధికారులు ఇంటి వెనుక నుండి తడిసిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నోట్లను తాకిన టీ-షర్టు భాగం రసాయన ధ్రువీకరణలో పాజిటివ్గా తేలింది.
ఇది అతనికి మొదటిసారి కాదు. నిందితుడు గతంలో పలు బిల్లుల క్లియరెన్స్ కోసం అదే ఫిర్యాదుదారుడి నుండి రూ. 4 లక్షలు బలవంతంగా వసూలు చేశాడు. ఇప్పుడు మిగిలిన చెల్లింపును విడుదల చేయడానికి మరో రూ. 75,000 డిమాండ్ చేశాడు. దీంతో సదరు అధికారిని అరెస్టు చేశారు. కరీంనగర్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతోందని.. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి గుర్తింపును గోప్యంగా ఉంచామని.. అధికారులు వెల్లడించారు.
సంబంధిత కథనం