జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక వ్యూహం - సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామాడి హరికృష్ణ-international indian dance festival organized under the auspices of sangeet natak akademi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక వ్యూహం - సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామాడి హరికృష్ణ

జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక వ్యూహం - సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామాడి హరికృష్ణ

కేంద్ర సంగీత నాటక అకాడమీ తలపెట్టిన అంతర్జాతీయ భారతీయ నృత్య మహోత్సవం వేడుకలకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జానపద, గిరిజన కళారూపాల అభివృద్ధికి, వికాసానికి , తెలంగాణ కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు.

అంతర్జాతీయ భారతీయ నృత్య మహోత్సవం - 2024

జానపద, గిరిజన కళారూపాల అభివృద్ధికి, వికాసానికి , తెలంగాణ కళాకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్ల ప్రస్తుతం తెలంగాణలో ఉండే అరుదైన జానపద, గిరిజన కళారూపాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని గుర్తు చేశారు. జాతీయస్థాయిలో ప్రత్యేకతని సాధించాయని చెప్పుకొచ్చారు.

కేంద్ర సంగీత నాటక అకాడమీ ఐదు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ భారతీయ నృత్య మహోత్సవం వేడుకలకు మామిడి హరికృష్ణ హాజరయ్యారు.  జానపద గిరిజన కళారూపాలపై ప్రత్యేక ప్రసంగం చేశారు. తెలంగాణ చారిత్రకంగా, సాంస్కృతికంగా వేలాది సంవత్సరాల వైభవాన్ని కలిగి ఉందన్నారు. 

ఆదిమ మానవుడి తొలి ఆనవాళ్లు పాండవుల గుట్ట ప్రాంతంలో లభించడంతో మధ్యప్రదేశ్ లోని భీమ్బేట్కా కన్నా ముందే మానవ సంచారం ఆదిమ కళల ఆవిష్కరణ మొదలైందని హరికృష్ణ తెలిపారు. అలా చిందు యక్షగానం, ఒగ్గుకథ, శారద కథ, కోలాటం, బోనాలు, బతుకమ్మ, గుస్సాడీ, కొమ్ము కోయ, లంబాడి, ధింసా ఇలాంటి ఎన్నో జానపద, గిరిజన, ఆదివాసి కళారూపాలు ఈ నేలమీద పురుడు పోసుకున్నాయని వివరించారు. సామాన్య ప్రజల జీవన విధానంలో ఇవన్నీ కూడా అంతర్భాగం అయ్యాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వీటి వికాసం కోసం నాలుగు రకాల వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు హరికృష్ణ తెలిపారు. గ్రామీణ వృత్తి కళల సంరక్షణ, ప్రత్యేక శిక్షణ ఏర్పాటు , కళాకారులకు అవకాశాలు , పెన్షన్ సదుపాయాలు ,ప్రత్యేక నగదు ప్రోత్సాహాన్ని అందిస్తూ నిరంతరం జానపద గిరిజన కళల వ్యాప్తికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.  ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని సాధించిన తెలంగాణ జానపద, గిరిజన, ఇతర కళాకారులకు ప్రభుత్వం 25 లక్షల నగదు ప్రోత్సాహక బహుమతిని అందించిందని  గుర్తు చేశారు. అర్హులైన పేద పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు 25,000 నగదు పింఛను కూడా సమకూరుస్తుందని ఈ సందర్భంగా చెప్పడంతో సభ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. 

జాతీయ స్థాయిలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వివిధ శాస్త్రీయ సంగీత నృత్య కారులు, జానపద, గిరిజన పరిశోధకులు ,రచయితలు, నర్తకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా మామిడి హరికృష్ణ చేసిన ప్రసంగం  అంతర్జాతీయ భారతీయ నృత్య ఉత్సవాల వేడుకలలో ప్రధానాకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయనను కేంద్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు సంధ్య పురేచా ప్రత్యేకంగా సత్కరించారు.