TS BJP : వారెందుకు బీజేపీలో చేరలేదు… మునుగోడు మీటింగ్పై చర్చ….
TS BJP మునుగోడు మీటింగ్లో బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో భారీగా చేరికలు ఉంటాయని జోరుగా ప్రచారం జరిగింది. తెలంగాణకు చెందిన పలువురు నేతలు షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగినా కోమటిరెడ్డికి తప్ప మిగిలిన వారెవ్వరికి ఆ అవకాశం దక్కలేదు. ఎందుకిలా జరిగిందనే చర్చ ఇప్పుడు బీజేపీలో నడుస్తోంది.
మునుగోడులో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ బీజేపీలోకి భారీ ఎత్తున వలసలు వస్తాయని జోరుగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్ప ఇంకెవరు పార్టీలో చేరలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రమే అమిత్ షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇతర నాయకులు ఎందుకు బీజేపీలోకి చేరలేదనే చర్చ ఇప్పుడు బీజేపీతో పాటు ఇతర రాజకీయ పక్షాల్లో నడుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
TS BJP తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అదే సమయంలో ఇతర ప్రాంతాలకు చెందిన తెలంగాణ నాయకులు కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి అమిత్ షా సభ ఉపయోగపడుతుందని, ఇతర పార్టీల నుంచి చేరికల్ని ప్రోత్సహించడానికి సభ ఉపయోగపడుతుందని భావించారు.
మునుగోడు సభలో రాజగోపాల్ రెడ్డితో పాటు మిగిలిన నాయకులు ఎవరు బీజేపీలో చేరలేదనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరడానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తారని, తెలంగాణలో కూడా చాలామంది మునుగోడులో పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినా ఎవరో అడ్డుపడటం వల్లే షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోలేకపోయారని ప్రచారం జరుగుతోంది.
ఈ విమర్శలపై రెండు రకాలుగా ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా సందర్భంగా పలువురు ద్వితియ శ్రేణి నాయకులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారు కూడా అమిత్ షా సమక్షంలో పార్టీలోచేరుతారని భావించినా వేదికపై ఎవరికి చోటు దక్కలేదు. మరోవైపు గతంలో టిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన వారిపై పాత కేసుల్ని తిరగదోడుతున్నారని అలా జరగకూడదనే ఉద్దేశంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరినే పార్టీలో చేర్చుకున్నారని చెబుతున్నారు.
TS BJP అమిత్ షా సభ సంధర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మరికొందరు నాాయకులు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా వారెవరు మునుగోడు సభలో కనిపించలేదు. దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయని, మునుగోడులో కోమటిరెడ్డి మాత్రమే హైలైట్ అవ్వడం కోసమే ఇలా చేశారని విమర్శలు వచ్చాయి. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే ఇలా చేశారని మరో వాదన ఉంది.
బహిరంగ సభ వేదికపై కోమటిరెడ్డితో పాటు ఇతర ప్రాంతాల నాయకుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తే మునుగోడు ఉపఎన్నిక విషయం పక్కదారి పడుతుందని అందుకోసమే మిగిలిన చేరికల్ని వాయిదా వేశారని చెబుతున్నారు. తెలంగాణలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు కార్యక్రమంలో ఇతర నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటారని చెబుతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే కార్యక్రమంలో పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.