డీఎస్సీ ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ నెల 5వ తేదీలోగా పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను మూడు రోజుల కిందట విడుదల చేసిన సంగతి తెలిసిందే.
దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన వారందరికీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి… నిర్ధేశించిన గడువులోగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 9090 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు.
ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం వెరిఫికేషన్ ఫామ్ ను కూడా విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొంది.
విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… అక్టోబర్ 5 వరకు వెరిఫికేషన్ ఉంటుంది.ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్ లో సమాచారం కూడా అందిస్తున్నారు.
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన వెరిఫికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని వివరాలను నింపాలి. ఇందులో డీఎస్సీ హాల్ టికెట్ నెంబర్, విద్యార్హతలు, టెట్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.