Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంగళవారం కీలక ప్రకటన చేశారు. రానున్న మూడు, నాలుగేళ్లలో రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున నిర్మిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేకే తమపై విమర్శలు చేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.
రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదవాళ్ల సొంతింటి కలను నేరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పుణ్యపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా ఇళ్లు లేక పేద ప్రజలు ఎదుర్కోన్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇందులో భాగంగా తొలి విడత 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారం రోజుల్లో పనులు మొదలుపెడతామని మంత్రి పొంగులేటి తెలిపారు. లబ్దిదారుల జాబితాలో పేర్లు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, మలివిడతలో అధికారులు లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లను ప్రారంభించిందన్నారు. వీటిని వేర్వేరుగానే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారన్నారు.
నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్లకు ఫిబ్రవరి 21న సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలించిన అనంతరం అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఈ పథకం తొలి విడతలో భాగంగా 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. లబ్దిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయం అందించనున్నారు.
సంబంధిత కథనం