ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే.. ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోంది. విడతల వారీగా నగదును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో వేస్తోంది. అయితే.. ప్రభుత్వం రూ.5 లక్షలకు తోడు.. ఇంకా కొంచెం డబ్బులు కలిపి మంచిగా ఇల్లు కట్టుకోవాలని చాలామంది అనుకున్నారు. కానీ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతుండటంతో.. లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రంలో 70 వేల 122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 2వేల 830 మంది లబ్ధిదారులు పునాదిని పూర్తి చేసుకున్నారు. సుమారు 280 మందికిపైగా 600 చదరపు అడుగులకుపైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. దీన్ని గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు రూ.లక్ష విడుదలకు నిరాకరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటేనే బిల్లులు అందిస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఈ పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది. ఇందిరమ్మ మోడల్ ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచింది. ఎలాంటి నిబంధనలను పెట్టబోమని స్పష్టం చేసింది. కానీ తాజాగా అధికారులు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఇంటిని నిర్మించుకోవాలని పదేపదే చెబుతుండడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు కాకుండా.. తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటున్నామని, ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. 600 చదరపు అడుగులు దాటితే బీపీఎల్ పరిధిలోకి రారని అధికారులు వివరిస్తున్నారు. పేదల ఇళ్లను 400 చదరపు అడుగుల్లోనే నిర్మించాలని.. ప్రభుత్వం అదనంగా 200 చదరపు అడుగులకు పెంచిందని గృహ నిర్మాణ శాఖ చెబుతోంది.
వచ్చేనెల 5వ తేదీలోపు ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు ఉండాలనే నిబంధనను విస్తృతంగా ప్రచారం చేయాలని.. క్షేత్రస్థాయి అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం కాకుండా.. నచ్చినట్టు కట్టుకుంటే బిల్లులు రావనే విషయంపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
సంబంధిత కథనం