ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలను వేస్తుంది. ఈనెల 19 లోగా కమిటీల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించే పనిలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. కమిటీలు కూర్పు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తుంది.
పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట ఇబ్బంది లేదు. కానీ ఎమ్మెల్యే లేనిచోట.. ఇటీవల బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఉన్న చోట సమస్యగా మారుతుంది. పాత కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం నేతలకు తలనొప్పిగా మారుతుంది. స్థానిక ప్రజా ప్రతినిధులు లేదా నాయకులు చైర్మన్ గా గ్రామ, డివిజన్ స్థాయిలో ఏడుగురితో వేస్తున్న ఇందిరమ్మ కమిటీలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులను ఎంపిక కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రత్యేకంగా ఇందిరమ్మ కమిటీలు వేసి లబ్దిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్ళు మంజూరు చేసింది.
ఈనెల 19వ తేదీలోగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో సందడి వాతావరణం నెలకొన్నది. అయితే తమ అనుచర గణానికి కమిటీలో చోటు కల్పించడం కోసం నేతలు ఎవరికి వారుగా పావులు కదుపుతుండటం వివాదాస్పదమవుతోంది. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తమ డివిజన్లలో తామే జాబితాలను తయారు చేస్తామని చెబుతుండగా.. పార్టీకి కష్టకాలంలో సేవలందిస్తూ వచ్చిన తమను కాదని కొత్త వారికి ఇస్తే ఊరుకునేది లేదంటూ సీనియర్ కార్యకర్తలు తేల్చిచెబుతుండడం కమిటీలను ప్రకటించిన తర్వాత కరీంనగర్ లో కలకలం చెలరేగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమిటీల్లో చోటు దక్కేదెవరికి అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల ఎంపిక బాధ్యతలను ప్రభుత్వం కమిటీలకు అప్పగించింది. ఏడుగురు ప్రతినిధులతో కూడిన కమిటీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించి ఆ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. మున్సిపల్ ప్రాంతాల్లో కార్పొరేటర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. కన్వీనర్ గా డివిజన్ అధికారిని ఒకరిని నియమించాల్సి ఉంటుంది. అదే విధంగా గ్రామ స్థాయిలో సర్పంచ్ లేదా గ్రామ స్థాయి నాయకుడు చైర్మన్ గా పంచాయితీ సెక్రటరీ లేదా స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్ గా కమిటీలో ఎస్సీ లేదా ఎస్టీ నుంచి ఒకరు, బీసీ నుంచి ఒకరు ఖచ్చితంగా సభ్యులుగా ఉండాలి. ఇద్దరు మహిళా గ్రూపుల నుంచి, మరొకరు జనరల్ కేటగిరి నుంచి ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఈ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులను ఎంపిక చేయడమే కాకుండా. సామాజిక తనిఖీలు కూడా నిర్వహించేందుకు అధికారం కలిగి ఉంటాయి. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయడంలో కీలక పాత్ర కమిటీలదే కావడంతో కమిటీల్లో చోటు దగ్గించుకునేందుకు ఎవరికి వారుగా కాంగ్రెస్ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్ , రామగుండం, వేములవాడ, ధర్మపురి, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో వారి సూచనల మేరకే కమిటీల ఏర్పాటు కానున్నాయి. హుజురాబాద్ లో అసెంబ్లీ ఇన్ చార్జి వొడితెల ప్రణవ్ ఆధ్వర్యంలో, సిరిసిల్ల లో కె.కె. మహేందర్ రెడ్డి, కోరుట్ల లో జువ్వాడి నర్సింగరావు, ఆద్వర్యంలో కమిటీలు ఏర్పడనున్నాయి.
ఇక కరీంనగర్ జగిత్యాలలో నేతలకు కమిటీల ఏర్పాటు సమస్యగా మారుతోంది. కరీంనగర్ లో నియోజకవర్గ ఇన్ చార్జి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం...పార్టీ శ్రేణులను పట్టించుకోకపోవడం సమస్యగా మారింది. అదే విధంగా జగిత్యాల లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య ఆదిపత్య పోరు సాగుతుంది. అక్కడ ఎవరి ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటుందో అర్థం కాక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏడాది క్రితం వరకు కాంగ్రెస్ కు ఒక్క కార్పొరేటర్ గాని.. మాజీ కార్పొరేటర్ గాని లేని పరిస్థితి. పార్టీ అధికారంలోకి రాగానే సీన్ మారిపోయింది. చేరికలతో నగర కాంగ్రెస్ బలోపేతమైంది. 11 మంది కార్పొరేటర్లు, మరో 10కి పైగా మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నేతలు ఇతర పార్టీల నుంచి వలస రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ కు ధీటుగా నిలిచిందనే భావన వ్యక్తమైంది.
ఈ క్రమంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందివచ్చిన ఈ కమిటీల ద్వారా డివిజన్లలో పార్టీని బలోపేతం కోసం ఉపయోగించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయం కొరవడిందని తెలుస్తోంది. నేతలందరూ తలోదారిన జాబితాలను సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరిన నేతలందరూ .. తమ డివిజన్లకు సంబంధించి తామే కమిటీల జాబితా ఇస్తామని, తమ వెంట పార్టీలో చేరిన వారికే కమిటీలో ప్రాధాన్యత ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది.
ఈ మేరకు జాబితాలను సిద్ధం చేసి కొందరు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో, మరికొందరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయంలో అందజేస్తున్నారు. మరి కొందరు డివిజన్ స్థాయి నేతలు మధ్యేమార్గంగా ఇరువర్గాలకు జాబితాలను అందజేసి చేతులు దులుపుకున్నారని తెలుస్తోంది.
పార్టీ అధికారంలోకి వచ్చి పది మాసాలు అవుతున్నా కనీస గుర్తింపు లేకుండా పోయిందని వాపోతున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాజా పరిణామాలతో షాక్ కు గురవుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అవహేళనలు, అవమానాలను ఎదుర్కొని పార్టీని నమ్ముకొని దశాబ్దకాలంగా పార్టీ జెండా మోస్తూ వచ్చామని.. తీరా ఎన్నికలకు ముందు తమను పక్కనబెట్టి రాత్రికి రాత్రి చేరిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ల అనుచరులకు ప్రాధాన్యతనివ్వడం ఎంత వరకు సమంజసమంటూ మండిపడుతున్నారు.
నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులను కూడా ఆశించకుండా పార్టీ కోసం శ్రమపడిన తమకు పార్టీ నాయకత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. డివిజన్లలో పార్టీని కాపాడుతూ వచ్చామని.. మరికొందరు నేతలు వాపోతున్నారు.
ఈ నెల 19న సాయంత్రంలోగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల ఎంపిక కోసం కమిటీలను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలకు సమాచారం అందించారు. కమిటీలు వివాదాస్పదం కాకుండా ఉండాలంటే పార్టీ నాయకత్వం ఏకతాటిపై నిలిచి ఒకే జాబితాను ఖరారు చేస్తే తప్ప వివాదం సద్దుమణిగే అవకాశం లేదు. ఆధిపత్య పోరు, గ్రూప్ రాజకీయాలు పాత కొత్త నేతల మధ్య సమన్వయ లోపం ఎటువైపు దారి తీస్తుందోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత కథనం