Devineni avinash …. ఏపీ, తెలంగాణల్లో ఐటీ సోదాలు…భూ లావాదేవీలపై ఐటీ కన్ను…
Hyderabad IT Raids ఏపీ, తెలంగాణల్లో ఐటీ, ఈడీ, సీబీఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా ఏదొక ప్రాంతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తనిఖీలు, సోదాలతో బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్, విజయవాడల్లో ఆదాయపన్ను శాఖ తనిఖీలు కలకలం రేపాయి. వంశీరామ్ బిల్డర్స్ వ్యవహారంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 36 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఇందులో రాజకీయ ప్రముఖులు ఉండటంతో కలకలం రేగింది.
Hyderabad IT Raids హైదరాబాద్ వంశీరామ్ బిల్డర్స్కు చెందిన లావాదేవీలపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఆర్ధిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఏక కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాడులు ప్రారంభించారు. వంశీరామ్ బిల్డర్స్కు చెందిన సుబ్బారెడ్డి, జనార్థన్ రెడ్డి నివాసాలతో పాటు వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం కలకలం రేపింది. హైదరాబాద్ భూ వివాదాల్లో విజయవాడకు చెందిన వైసీపీ నాయకుల ప్రమేయం ఏమిటనే చర్చ మొదలైంది.
వివాదాస్పద భూముల లావాదేవీలు….
హైదరాబాద్లోని వివాదాస్పద భూముల వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్లోని ఖరీదైన భూమి వ్యవహారం చుట్టూ పలు వివాదాలు నెలకొన్నాయి. వందల కోట్ల రుపాయల విలువైన భూముల వ్యవహారంలో బోలెడు మలుపులు ఉన్నాయి.
హైదరాబాాద్లోని అత్యతం ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్ ప్రాంతం కేంద్రంగా తాజా వివాదం జరుగుతోంది. 1995లో వివిఐపి జోన్గా బంజారాహిల్స్ను అధికారికంగా గుర్తించారు. ఈ ప్రాంతంలో 3వేల ఎకరాలకు పైగా సర్ఫేకస్ భూములు ఉన్నాయి. మిగులు భూమిని దశాబ్దాల తరబడి రకరకాల మార్గాల్లో అన్యా క్రాంతం అవుతూ వచ్చింది. ఈ భూమి చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి సర్వే నంబర్ 403లో వందల ఎకరాల భూమి ఉంది. కోర్టు తీర్పుల నేపథ్యంలో ఇందులో కొంత భూమిని కొందరికి స్వాధీనం చేయాల్సి వచ్చింది.
బంజారాహిల్స్ హయత్ హోటల్ సమీపంలో ఉన్న ఐదెకరాల భూమిలో వంశీరామ్ బిల్డర్స్ కొన్నేళ్ల క్రితం డెవలప్మెంట్ చేయడానికి ఒప్పందం చేసుకుంది. హయత్ హోటల్ పక్కన ఉన్న ఖాళీ స్థలం చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఆ భూమికి క్లియర్ టైటిల్ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి1954-55లో 403 సర్వే నంబర్లను కేటాయించారు. వీటిని పట్టా భూములుగా పహాణిల్లో నమోదు చేశారు. 1983లో పట్టణ ప్రాంతాల్లో పహానీలను ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మండలాలు ఏర్పాటు చేశారు. 1976లో అమల్లోకి వచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్తో భూములు ప్రభుత్వ పరం అయ్యాయి. దాదాపు 360ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించారు. అప్పట్లో రైతులు అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్లను ఇవ్వక పోవడంతో వాటిని ఇతరులు కొనుగోలు చేస్తూ వచ్చారు.
అర్బన్ పహానీలు రద్దు అయినా వాటిలో సాగు కొనసాగించారు. ఆ ప్రాంతంలో రైతులు పశువులు మేపుకునే వారు. 1985లో బంజారాహిల్స్ ప్రాంతాన్ని వివిఐపి జోన్గా ప్రకటించిన తర్వాత అక్కడ వ్యవసాయాన్ని నిలిపివేశారు. ఈ క్రమంలోనే కొందరు తప్పుడు పత్రాలతో కొందరు బంజారాహిల్స్ భూముల్ని తమవిగా పేర్కొంటూ ప్రభుత్వానికి డిక్లరేషన్లు ఇచ్చారు. 1999లో కొన్ని మార్గదర్శకాలతో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 455తీసుకొచ్చింది. ప్రభుత్వ జీవో ప్రకారం ఒక్కో కుటుంబానికి 3వేల మీటర్ల వరకు భూమిని క్రమబద్దీకరించాల్సి ఉంది.
జీవో 455 ఆధారంగా 2007లో జీవో 68, 2008లో జీవో 430 జారీ చేశారు. జీవో నంబర్ 455కు విరుద్ధంగా 17,600గజాల భూమిని అప్పటి ప్రబుత్వం క్రమబద్దీకరించారు. మొత్తం 25మంది పేర్ల మీద 5 రిజిస్ట్రేషన్లు చేశారు. ఆ తర్వాత ఇదే భూమి దేవినేని నెహ్రూ చేతుల్లోకి వెళ్లింది. మరో 2వేల గజాల భూమిని రూ.20కోట్ల రుపాయలతో కొనుగోలు చేసినట్లు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ భూమిని బ్లూ స్ట్రీక్ కన్స్ట్రక్షన్స్, ఉల్కాన్ బిల్డర్స్కు మళ్లీ రీ రిజిస్ట్రేషన్ చేశారు. ఇవి అక్రమం అంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో టైటిల్ కోసం కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
చేతులు మారిన భూమి….
బంజారా హిల్స్లో ఉన్న భూమిని సత్యనారాయణ కుమార్తె దేవికా రాణి నుంచి కొనుగోలు చేయడానికి దేవినేని అవినాష్ డ్రైవర్ డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో ఉంది. డ్రైవర్గా ఉన్న వ్యక్తి రూ.70లక్షల చెల్లించడం వెనుక మతలబు ఉందని ప్రత్యర్థులు ఫిర్యాదులు ఆదాయపన్ను శాఖ, ఈడీలకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈడీ కేసులు నమోదు చేసి భూమిని అటాచ్ చేసింది. దీనిని గతంలో ఐటీ ట్రిబ్యునల్లో దేవినేని కుటుంబం సవాల్ చేసింది. ఐటీ ట్రిబ్యునల్ పిటిషన్ కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి అనుకూలంగా తీర్పు రాలేదు. 2021లో ఈడీ భూమిని అటాచ్ చేసింది. హైకోర్టులో ఈడీ జప్తుపై రకరకాల పిటిషన్లు దాకలయ్యాయి. ఈ భూమిపై రామచంద్రయ్య అనే వ్యక్తి కోర్టుకెక్కారు. భూమిలో నిర్మాణాలపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
మలుపులు తిరుగుతున్న భూ వివాదం….
బంజారాహిల్స్ భూములపై వివాదం కొనసాగుతుండగానే వంశీరాం బిల్డర్స్ డెవలప్మెంట్ ఒప్పందం చేసుకుంది. రెండు ఎకరాల్లో ప్రాజెక్టు ప్రారంభించారు. ఇందుకు దేవికారాణికి రూ47కోట్లు చెల్లించారు. దేవికారాణికి ప్రభుత్వం 6700చదరపు మీటర్లు క్రమబద్దీకరించినా, వెయ్యి మీటర్లు అదనంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూములపై కేసులు ఉండటంతో బ్యాంకర్లు రుణాలివ్వడానికి ముందుకు రాలేదు. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెట్టారని ప్రచారంలో ఉంది. వంశీరామ్ బిల్డర్స్లో భాగస్వామ్యం ఉండటం, భూముల లావాదేవీలలో వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ కుటుంబానికి భాగస్వామ్యం ఉండటంతో ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉందనే అనుమానాలతో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.