TS Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు - ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, IMD తాజా అప్డేట్స్ ఇవే
Telangana Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు మరింతగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది ఐఎండీ.

Telangana Weather Updates: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ఉగ్రరూపంతో బయటికి వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నాయి. ఉదయం 10 దాటకముందే పనులు చూసుకుంటున్నారు.
మళ్లీ సూర్యుడి ప్రతాపం తగ్గిన తర్వాతే…. బయటికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటిని పరిస్థితి ఉంది. బుధవారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్లో 46.6డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. చాలాచోట్ల కూడా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఆరెంజ్ హెచ్చరికలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల( మే 2 మధ్యాహ్నం తర్వాత) చేసిన బులెటిన్ ప్రకారం…. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు (orange alert)జారీ అయ్యాయి. మరికొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను ఇచ్చారు.
- మే 2వ తేదీన : జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో దీర్ఘకాల వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- మే 3వ తేదీన : తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ దీర్ఘకాల వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- మే 4వ తేదీన : పొడి వాతావరణం ఉంటుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ దీర్ఘకాల వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఖమ్మం, నల్గొండ, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మరోవైపు హైదరాబాద్లో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు అయ్యాయి. కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కరోనా తరువాత గరిష్ఠంగా 42డిగ్రీలు నమోదుకాగా ఈ వేసవిలో మాత్రం పగలు ఉష్ణోగ్రతలు 43డిగ్రీలను దాటేయడం రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30డిగ్రీలకు చేరుకోవడంతో పాటు , గాలిలో తేమ 20శాతం కంటే కిందకు పడిపోవడంతో ఎండ వేడి, వడగాల్పులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
బుధవారం హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43.0డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.9డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. గాలిలో తేమ 16శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో గ్రేటర్లో వడగాల్పులు వీస్తున్నాయి.
సంబంధిత కథనం