హైదరాబాద్ యూనివర్శిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములపై వివాదం కొనసాగుతోంది. అక్కడ ఎలాంటి పనులు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో… ప్రస్తుతం స్టే కొనసాగుతోంది. మరోవైపు ఈ భూముల వ్యవహారంలో ఐఏ జనరేటెడ్ ఫొటోను వైరల్ చేసిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై లోతుగా విచారించాలని నిర్ణయించటంతో.. ఆ దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.
ఏఐ జనరేటెడ్ ఫొటోను సృష్టించటంతో పాటు షేర్ చేసిన ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలు ఖాతాలను గుర్తించారు. ఇందులో కొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే… సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు కూడా సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మార్చి 31వ తేదీన స్మితా సబర్వాల్ ఎర్త్ మూవింగ్ మెషిన్లు, రెండు జింకలు, ఒక నెమలితో కూడిన ఫొటోను 'ఎక్స్'లో షేర్ చేశారు. ఈ పోస్టుకు సంబంధించి ఏప్రిల్ 12వ తేదీన బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేసినట్లు ఓ పోలీస్ అధికారులు తెలిపారు. నోటీసుకు సమాధానం ఇవ్వాలని మాత్రమే ఇందులో పేర్కొన్నట్లు తెలిసింది.
ఇక ప్రస్తుతం స్మితా సబర్వాల్… తెలంగాణ కేడర్ అధికారిగా ఉన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కంచ గచ్చిబౌలి వ్యవహారంలో ఓ ఐఏఎస్ అధికారికి నోటీసులు జారీ ఇవ్వటం చర్చనీయాశంగా మారింది. నోటీసుల అంశంపై స్మితా సబర్వాల్ స్పందించాల్సి ఉంది.
హైదరాబాద్ యూనివర్శిటీకి అనుకుని ఉన్న కంచ గచ్చిబౌలి భూములను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించింది. ఈ భూమిని టీజీఐఐసీకి అప్పగించింది. ఈ క్రమంలోనే ఆ భూమిని చదును చేసేందుకు పెద్ద ఎత్తున జేసీబీలను రంగంలోకి దించి… కొన్ని చెట్లను తొలగించింది. ప్రభుత్వ చర్యలను యూనివర్శిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు.
సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని అన్ని విద్యార్థి సంఘాలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి. వీరి పోరాటానికి చాలా వర్గాల నుంచి మద్దతు లభించింది. పర్యావరణాన్ని పరిరక్షించాలని… వృక్ష సంపదను నాశనం చేయవద్దంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేశారు. ఇదే విషయం తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.
సంబంధిత కథనం