రూ.750 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా...! ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకున్న హైడ్రా-hydraa removed encroachments on 5 acres of govt land in banjara hills land worth rs 750 crore ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రూ.750 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా...! ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకున్న హైడ్రా

రూ.750 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా...! ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకున్న హైడ్రా

హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్ లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 750 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. ఇక్కడ నిర్మించిన నిర్మాణాలను కూడా తొలగించారు.

హైడ్రా కూల్చివేతలు

ప్రభుత్వ భూములను కాపాడే దిశగా హైడ్రా దూసుకెళ్తోంది. నగరంలోని చాలా చోట్ల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాపాడుతోంది. తాజాగా బంజారాహిల్స్ లోనూ 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. రూ. 750 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో వెలసిన నిర్మాణాలను కూల్చివేసింది.

హైడ్రా విడుదల చేసిన ప్రకటన మేరకు… షేక్ పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో ఈ అక్రమణాలు జరిగాయి. 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించింది. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెళ్లారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలను కూడా కాపాలా పెట్టారు.

కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డూలు నిర్మించుకున్నారు. అయితే ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీనికితోడు జలమండలితో పాటు రెవెన్యూ అధికారులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

ఫేక్ సర్వే నంబర్ (403/52) తో ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పార్థసారథి కొట్టేసే ప్రయత్నం చేశాడని హైడ్రా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెవెన్యూ, జలమండలి అధికారులు 4 క్రిమినల్ కేసులు కూడా పెట్టారని వెల్లడించింది. వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి ఆక్రమణలకు పాల్పడినట్టు తేలిందని వెల్లడించింది.

ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు హైడ్రా నిర్ధారించుకుంది. షేక్ పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను తొలగించింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం