హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన కట్టడాలను కూల్చివేసింది. హఫీజ్ పేటలో ఉన్న 17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అందులో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన ఆఫీసు సైతం ఉంది. ఈ 17 ఎకరాల విలువ రెండు వేల కోట్లకుపైగా ఉటుందని అంచనా. ఈ భూమిలో షెడ్లను నిర్మించారు. వీటిలో సినిమా షూటింగ్లకు సంబంధించిన పరికరాలను ఉంచారు. ఈ షెడ్లను హైడ్రా అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు.
హైడ్రా కూల్చివేతలపై టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. హైడ్రా న్యాయబద్ధంగా కూల్చివేస్తే వారాంతాల్లోనే ఎందుకు కూలుస్తున్నారని మండిపడ్డారు.
"నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో న్యాయవ్యవస్థ క్రియాశీలకంగానే ఉంది. కచ్చితంగా న్యాయం గెలుస్తోంది. నేను కోర్టును ఆశ్రయిస్తారు. ఇది కచ్చితంగా నా ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అయితే వీకెండ్ లోనే ఎందుకు కూలుస్తున్నారు. ఇక్కడున్న భూములపై 7 కేసులు పెండింగ్ అంటున్నారు. వీటిల్లో ఎక్కడైనా సర్వే నెంబర్ 79 ఉండుంటే... హైడ్రా చర్యలు నేను బాధ్యుడిని అవుతా. ఈ కేసుల్లో ఎక్కడా నా భూమి పెండింగ్ లో లేదు. 2014లో ప్రభుత్వమే ఈ భూమిపై మెమో ఇచ్చింది. ఇది సొంత ఆస్తి, దీనిపై మీరు అప్పిల్ చేయవద్దని ప్రభుత్వమే చెప్పింది. రెవెన్యూ శాఖ, రంగారెడ్డి కలెక్టర్ సైతం సర్వే నెంబర్ 79పై ఎలాంటి కేసులు పెండింగ్ లేవని చెప్పారు. వీటిని కోర్టు ముందుకు తీసుకెళ్తాం"- టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
"కోర్టు ఏది చెబితే దానికి నేను కట్టుబడి ఉంటాం. అసలు మాకు నోటీసులు ఇవ్వలేదు. ఏదో చిన్న కాగితం ఇచ్చి ఆఫీసుకు రమ్మన్నారు. నేను స్వయంగా ఆఫీసుకు వెళ్లి, అన్ని పత్రాలు సమర్పించి వివరణ ఇచ్చాను. ఏమైనా సందేహాలు ఉంటే మళ్లీ పిలుస్తామన్నారు. కానీ మళ్లీ పిలువలేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ ఉదయం 5.30 గంటలకు వచ్చి కూల్చివేతలు మొదలుపెట్టారు. అకారణంగా, అన్యాయంగా మా ఆస్తులు నేలమట్టం చేస్తున్నారు. దీనిపై నేను కోర్టుకు వెళ్తాను"- టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. వారు రాగానే కలుస్తాను. నాకు జరిగిన అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాను. ఇందులో ఎవరికి పాత్ర ఉందో తెలియదు. ఇది 23 సంవత్సరాలుగా నా చేతిలో ఉంది. ఇదంతా ఒకప్పుడు గొంగళి పురుగులా ఉండేది, నేను సీతాకోక చిలుకలా మార్చాను. అందుకే కొందరి దృష్టి దీనిపై పడొచ్చు. నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి వ్యాపారాలు చేయడంలేదు. ఇక్క ఆఫీసు కట్టాను. త్వరలో కొత్త ప్రాజెక్ట్ చేపడతామని నిర్ణయించుకున్నాను. ఇంతలో ఇలా కూల్చివేతలు మొదలుపెట్టారు. నన్ను ఏ మంత్రి అప్రొచ్ కాలేదు" -టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను శనివారం తొలగించినట్లు హైడ్రా ప్రకటించింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టులలో కేసులున్నప్పటికీ చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి బడా నిర్మాణ సంస్థలు ఆక్రమణలకు పాల్పడ్డాయని హైడ్రా ఆరోపించింది. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ కొండపూర్ లోని హఫీజ్ పేట్ సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలు ఉండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి.
సర్వే నంబరు 79 ప్రభుత్వ భూమి, నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డులలో నమోదై ఉంది. ఆ సర్వే నంబరు 79/1 గా సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది వసంత హోమ్స్ సంస్థ.
ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించి అమ్మేసి.. ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసు కార్యాలయంతో పాటు.. పలు షెడ్డులు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చారు. ఈ భూములపై సుప్రీంకోర్టులో చాలా కాలంగా సి.ఎస్.14/58 అనే వాజ్యం పెండింగులో ఉండగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చారు. ఈ ప్రభుత్వ భూమిపై కోర్టులో కేసులుండగా, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా పట్టించుకాకుండా నిర్మాణాలు చేపట్టారు. ఫైనల్ డక్రీ రాకుండానే ఈ భూములలో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని పై వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రహరీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాల తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
తాము రోజూ ఆడుకునే చోట ఆడనివ్వడంలేదని.. అక్కడ చెరువును కూడా మాయం చేస్తున్నారని.. రహదారులు నిర్మిస్తున్నారని, క్రికెట్ ఆడుకునే యువకుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. షేక్ పేట మండలం రాయదుర్గం దర్గా దగ్గరలోని సర్వే నెంబర్ 5/2లో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా... 39 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్టు నిర్ధారించింది. ల్యాండ్ గ్రాబింగ్ కేసున్నట్టు అక్కడ బోర్డులుంటుండగానే.. మరోవైపు అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో నార్నే ఎస్టేట్స్ సంస్థ బోర్డులు ఏర్పాటు చేసింది. అనుమతిలేని లే ఔట్తో రహదారులు నిర్మిస్తూ ఆక్రమణదారులు ప్లాట్లు అమ్మకాలు చేపట్టారు. అక్కడ చెరువును కూడా కబ్జా చేసి నార్నే ఎస్టేట్స్ సంస్థ ప్లాట్లుగా అమ్మకాలు చేస్తున్నారు. హఫీజ్పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. ఆక్రమణ దారులపై పోలీసు కేసు నమోదు చేయినట్లు హైడ్రా తెలిపింది.
సంబంధిత కథనం