Hyderabad Water Supply : హైదరాబాద్ లో మంజీరా వాటర్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 వరకూ మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి అధికారులు తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 30 గంటలపాటు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. ఎర్రగడ్డ, అమీర్పేట, కేపీహెచ్బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట, ఎల్లారెడ్డిగూడ, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీనగర్, మదీనా గూడ, మియాపూర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కనిపిస్తుంది.
హైదరాబాద్ కు మంచినీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్- 2లో కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు, పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న పైపులైన్ పనులు చేపడుతున్నారు. బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులకు ఆటంకం లేకుండా అధికారులు పైప్ లైన్ పనులు చేపడుతున్నారు. ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 20 తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు పైప్ లైన్ పనులు జరగనున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో మంజీరా నీటి సరఫరాను కొన్నిచోట్ల పూర్తిగా, కొన్ని చోట్ల పాక్షికంగా నిలిపివేయనున్నారు. దాదాపు 30 ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుందని జలమండలి అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది.