TS Govt Serious On JPS : రేపటి లోపు విధుల్లో చేరాలి, లేకపోతే ఉద్యోగాల్లోంచి తొలిగిస్తాం- తెలంగాణ సర్కార్ వార్నింగ్
TS Govt Serious On JPS : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెపై తెలంగాణ సర్కార్ ప్రభుత్వం సీరియస్ అయింది. రేపు సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని స్పష్టం చేసింది.
TS Govt Serious On JPS : తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(JPS) సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మె వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. రేపు(మంగళవారం) సాయంత్రం 5 గంటల లోపు జేపీఎస్ లు విధుల్లో చేరాలని ఆదేశించింది. ఒక విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(JPS), ఒప్పంద పంచాయతీ కార్యదర్శులు(OPS) గత నెల 29వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
11 రోజులుగా నిరవధిక సమ్మె
తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్)లు 11 రోజులుగా ఉద్ధృతంగా సమ్మె చేస్తున్నారు. 2019లో ఉద్యోగ నియామకం చేపట్టినప్పుడు మూడేళ్ల ప్రొబేషనరీ తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచిన ప్రభుత్వం ప్రొబేషనరీ గడువును మరో ఏడాది పెంచింది. అనంతరం రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 12తో నాలుగేళ్ల ప్రొబెషనరీ గడువు ముగిసిపోయింది. అయినా క్రమబద్దీకరణపై ప్రభుత్వం స్పందించకపోవడంతో జేపీఎస్, ఓపీఎస్ లు సమ్మెను దిగారు. జేపీఎస్ల నియామకం సమయంలో రూ.15 వేల వేతనం ఇవ్వగా, 2021 జులై నుంచి పీఆర్సీ ప్రకారం రూ.28,719కు వేతనం పెంచారు. ప్రభుత్వం తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తుందని ఇన్నాళ్లు వేచి చూశామని, కానీ ప్రభుత్వం స్పందించికపోవడంతో సమ్మెకు దిగామని జేపీఎస్ లు అంటున్నారు.
చర్చలు జరిపాలని డిమాండ్
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో, అన్ని మండల కేంద్రాల్లో జేపీఎస్ లు శిబిరాలు ఏర్పాటుచేసుకుని సమ్మె నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 325 మంది ప్రొబెషనరీ జేపీఎస్లు, 33 మంది ఔట్సోర్సింగ్ జేపీఎస్లు ఉండగా, నారాయణపేట జిల్లాలో 167 మంది ప్రొబేషనరీ, 35 మంది ఔట్సోర్సింగ్ జేపీఎస్లు విధుల్లో ఉన్నారు. జేపీఎస్లు సమ్మెకు దిగడంతో గ్రామ పంచాయతీల నిర్వహణ ఎక్కడికక్కడే ఆగిపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా పంచాయతీ కార్యదర్శులు కీలకంగా వ్యవహరిస్తారు. జేపీఎస్ ల సమ్మెతో ఆ లోటు కనిపిస్తోంది. ఇంకా సమ్మె కొనసాగితే పంచాయతీల్లో పాలన నిలిచిపోతుందని, ప్రభుత్వం తక్షణమే జేపీఎస్లతో చర్చలు జరిపి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్లు చేస్తున్నారు.
మూడేళ్లకే క్రమబద్దీకరిస్తామని చెప్పి, నాలుగేళ్లయినా రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయమని జేపీఎస్ లు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీలకు వెన్నెముకలా పనిచేసే తమకు చట్టపరంగా రావాల్సిన హక్కులను కల్పించాలని వేడుకుంటున్నారు. వెంటనే రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఈ నాలుగేళ్లను కూడా సర్వీసులో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.