Shadnagar Fire Accident : షాద్ నగర్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు, ఆరుగురు మృతి
Shadnagar Fire Accident : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. స్థానిక గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.

Shadnagar Fire Accident : రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. షాద్ నగర్ లోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో కంప్రెసర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మందికి తీవ్రగాయాల అయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
షాద్నగర్ సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఫరూఖ్నగర్ మండలం బూర్గుల దగ్గర ఉన్న పరిశ్రమలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. బాయిలర్ ఫర్నస్ పేలినట్లు కార్మికులు చెబుతున్నారు. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. బాయిలర్ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసులు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మరికొంత మంది తీవ్రగాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఒడిశా, బిహార్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
షాద్ నగర్ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. ప్రమాదస్థలిలోనే ఉన్న కలెక్టర్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు ఘటనా స్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కేటీఆర్ దిగ్భ్రాంతి
"షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించిన విషయం తెలిసి షాక్ కు గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని పారిశ్రామిక ప్రాంతాలలో విపత్తు నిర్వహణ ప్రణాళికలను క్షుణ్ణంగా సేఫ్టీ ఆడిట్, సమీక్షను వెంటనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను" - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సంబంధిత కథనం