TGSRTC : ఆర్టీసీ బస్సులో మహిళకు పురుడు పోసిన సిబ్బందికి సన్మానం, చిన్నారికి జీవిత కాలం ఫ్రీ బస్ పాస్-hyderabad sajjanar felicitated tsrtc employees helped women delivered baby girl ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc : ఆర్టీసీ బస్సులో మహిళకు పురుడు పోసిన సిబ్బందికి సన్మానం, చిన్నారికి జీవిత కాలం ఫ్రీ బస్ పాస్

TGSRTC : ఆర్టీసీ బస్సులో మహిళకు పురుడు పోసిన సిబ్బందికి సన్మానం, చిన్నారికి జీవిత కాలం ఫ్రీ బస్ పాస్

HT Telugu Desk HT Telugu

TGSRTC : ఆర్టీసీ బస్సుల్లో గర్భిణీకి పురుడుపోసిన సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. బస్సులో జన్మించిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా బస్ పాస్ అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్టీసీ బస్సులో మహిళకు పురుడు పోసిన సిబ్బందికి సన్మానం

TGSRTC : తమ బస్సులో గర్భిణీకి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించారు. బస్సులో జన్మించిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళా కండక్టర్ సిబ్బందికి సన్మానం

హైదరాబాద్ లోని ముషీరాబాద్ డిపోనకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు. బహదూర్ పుర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ అనంతరం అనంతరం మెరుగైన వైద్యం కోసం బుస్సులోనే సమీపంలోని గవర్నమెంట్ మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సకాలంలో కాన్పు చేసిన కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీ సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసించారు. వారు చాకచక్యంగా వ్యవహరించడంతోనే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, ముషీరాబాద్ డీఎం కిషన్, తదితరులు పాల్గొన్నారు.

బోనాల సందర్భంగా......గోల్కొండ కోటకు 75 ప్రత్యేక బస్సులు

ఆదివారం జరగబోయే చరిత్రాత్మకమైన గోల్కొండ జగదాంబిక బోనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 75 ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతుంది. హైదరాబాద్ లోని 24 ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు తిప్పనుంది. సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే, సీబీఎస్‌, పటాన్‌ చెరు, ఈసీఐఎల్‌, మెహిదీపట్నం, దిల్‌ షుక్‌నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, తదితర ప్రాంతాల నుంచి గోల్కొండ కోట వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ పేర్కొంది.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

సంబంధిత కథనం