జాతీయ భద్రతా హెచ్చరికలు.. హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం!-hyderabad police bans firecrackers in public due to national security alert ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జాతీయ భద్రతా హెచ్చరికలు.. హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం!

జాతీయ భద్రతా హెచ్చరికలు.. హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం!

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసింది. దీంతో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పటాకులు కాల్చడం నిషేధించారు పోలీసులు.

పటాకులపై నిషేధం (unsplash)

జాతీయ భద్రతా హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పటాకులు కాల్చడాన్ని నిషేధించారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

బాణసంచాపై నిషేధం..

భారతదేశం అంతటా కొనసాగుతున్న హై అలర్ట్ నేపథ్యంలో.. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో భద్రతా ఏర్పాట్లను తీవ్రతరం చేశారు. నగరంలోని బహిరంగ ప్రదేశాలలో.. ముఖ్యంగా సైనిక కంటోన్మెంట్ ప్రాంతాల సమీపంలో పటాకులు లేదా బాణసంచా పేల్చడంపై పోలీసులు నిషేధం విధించారు. హైదరాబాద్ నగర పోలీసు చట్టంలోని సెక్షన్ 67(సీ) కింద.. నగర పోలీసు కమిషనర్ సీ.వీ. ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా భద్రత, ఆందోళనలు నిషేధానికి కారణమని స్పష్టం చేశారు.

కారణం ఇదే..

'బాణసంచా నుంచి అకస్మాత్తుగా వచ్చే పెద్ద శబ్దాలను పేలుళ్లు లేదా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలుగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ప్రజలు భయాందోళనకు గురవుతారు. ఇది అత్యవసర ప్రతిస్పందనలను క్లిష్టతరం చేయవచ్చు' అని నగర కమిషనర్ వివరించారు. 'ఇటువంటి చర్యలు ప్రజాధైర్యాన్ని దెబ్బతీస్తాయి. భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతాయి' అని సీ.వీ. ఆనంద్ చెప్పారు.

తక్షణమే అమల్లోకి..

ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటుందని చెప్పారు. ఇది అన్ని వర్గాలకు వర్తిస్తుందని తేల్చిచెప్పారు. ఈ సున్నితమైన సమయంలో ప్రశాంతత, భద్రతను కాపాడుకోవడంలో పౌరులు సహకరించాలని కోరారు. ఈ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే.. చట్ట ప్రకారం చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరించారు.

భద్రతే ముఖ్యం..

తాజా పరిస్థితులపై మాజీమంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'దేశ ప్రజల భద్రతే మాకు ముఖ్యం. మతం పేరు అడిగి టూరిస్టులను చంపడం కలిచివేసింది. ఇలాంటి సమయంలో యువత త్యాగానికి సిద్ధంగా ఉండాలి. సైనికుల కుటుంబాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉంది. సైనికుల పోరాటమే మాకు స్ఫూర్తి' అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

ఎయిర్‌పోర్టులు బంద్..

మరోవైపు దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులను మూసివేశారు. ఈ నెల 15 వరకు 24 ఎయిర్‌పోర్టులను బంద్‌ చేశారు. ఉత్తర, పశ్చిమ భారత్‌లోని ఎయిర్‌పోర్టులను మూసివేశారు. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అమృత్‌సర్‌లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్‌లు మోగాయి. అమృత్‌సర్‌లో డ్రోన్‌ దాడికి పాక్‌ యత్నించింది. డ్రోన్‌ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత ఆర్మీ. అమృత్‌సర్‌లో పేలుళ్ల శబ్ధం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత కథనం