TS Govt On Gig Workers : గిగ్ వర్కర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, కీలకమైన జీవో జారీ
TS Govt On Gig Workers : తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు జీవో జారీ చేసింది.
TS Govt On Gig Workers : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల యాక్సిడెంట్ పాలసీ సదుపాయం కల్పిస్తూ శనివారం జీవో జారీ చేసింది. ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో సుమారు మూడున్నర లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంతో భేటీలో... తమకు ఉద్యోగ భద్రత, తమ సమస్యలు పరిష్కరించాలని గిగ్ వర్కర్లు కోరారు. దీంతో తాజాగా గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్విగ్గీ బాయ్ కుటుంబానికి ఆర్థిక సాయం
నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని సీఎం గుర్తు చేశారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం వారం రోజుల్లో అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి సీఎం చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
గిగ్ వర్కర్లకు హామీలు
గిగ్ వర్కర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ డెలవరీ బాయ్స్ కు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలుకు జీవో జారీ చేశారు. ఇటీవల గిగ్ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి... పలు కీలక హామీలు ఇచ్చారు. గిగ్ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమాతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. క్యాబ్ డ్రైవర్లకు ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఓ యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అసంఘటిత రంగాల్లో కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. అసంఘటిత కార్మికులకు విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజస్థాన్ అమలు చేస్తున్న చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చట్టాన్ని ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఆటో, క్యాబ్ డ్రైవర్లు, గిగ్ వర్కర్లు నుంచి అప్లికేషన్ స్వీకరించి వారి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.