TS Assembly Speaker : స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్, బీఆర్ఎస్ మద్దతు-hyderabad news in telugu congress mla gaddam prasad kumar filed nomination for assembly speaker ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Speaker : స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్, బీఆర్ఎస్ మద్దతు

TS Assembly Speaker : స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్, బీఆర్ఎస్ మద్దతు

TS Assembly Speaker : వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణకు తొలి దళిత స్పీకర్ గా ఎన్నికకానున్నారు. ఆయన ఇవాళ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. గడ్డం ప్రసాద్ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది.

గడ్డం ప్రసాద్ కుమార్ తో సీఎం రేవంత్ రెడ్డి

TS Assembly Speaker : తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవికి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. వికారాబాద్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ స్పీకర్ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి ఆయన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ప్రసాద్‌ కుమార్‌ వెంట సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో సహా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై మాజీ మంత్రి కేటీఆర్‌ సంతకం పెట్టారు. గురువారం ఉదయం శాసనసభలో స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.

తొలి దళిత స్పీకర్

తెలంగాణ శాసనసభకు స్పీకర్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి స్పీకర్‌ గా ఉంటారు. స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. గడ్డం ప్రసాద్‌ కుమార్ స్పీకర్‌గా నియమితులైతే ఆయన తెలంగాణకు తొలి దళిత స్పీకర్‌ కానున్నారు. తెలంగాణ శాసనసభలో ఎక్కువ సభ్యులు అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. అయితే స్పీకర్ పదవి దళిత నేతకు ఇచ్చి అగ్రస్థానంలో నిలిపామన్న భావనను ప్రజల్లోకి పంపేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ నేతలు అంటున్నారు.

గడ్డం ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం

దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్.. రంగారెడ్డి జిల్లా మర్పల్లి లో 1964 లో జన్మించారు. తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ఇంటర్ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనగా 2008 లో జరిగిన ఉపఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి బి. సంజీవరావుపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో జరిగిన ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి చంద్రశేఖర్ పై 4,859 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు.

కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా

గడ్డం ప్రసాద్ కుమార్ 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో టెక్స్టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా నియమితులయ్యారు. గడ్డం ప్రసాద్ కుమార్ ను 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా అధిష్టానం చోటు కల్పించింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాద్ కుమార్ ఘనవిజయం సాదించారు. ఈ నేపథ్యంలో గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి, తరుణ్