Indiramma Housing Scheme : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభం-hyderabad news in telugu cm revanth reddy says indiramma housing scheme started on march 11 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Indiramma Housing Scheme : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభం

Indiramma Housing Scheme : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభం

Indiramma Housing Scheme : మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభం

Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Housing Scheme ) పథకాన్ని ఈ నెల 11న ప్రారంభనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తెలిపారు. ఈ పథకం విధివిధానాలు, నిబంధనలను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మార్గదర్శకాలపై సమీక్ష

ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అన్నారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.

ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు

రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలని చెప్పారు. ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యమివ్వాలని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా, అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు.

వివిధ ఇంటి నమూనాలు

సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సీఎం సూచించారు. లబ్ధిదారులు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని చెప్పారు.

సంబంధిత కథనం