200 Units Free Power : గృహజ్యోతి పథకంలో లోటుపాట్లు, 201 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే ఏం చేయాలి?-hyderabad news in telugu brs mla harish rao demands free upto 200 units charge remains power in gruha jyothi scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  200 Units Free Power : గృహజ్యోతి పథకంలో లోటుపాట్లు, 201 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే ఏం చేయాలి?

200 Units Free Power : గృహజ్యోతి పథకంలో లోటుపాట్లు, 201 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే ఏం చేయాలి?

200 Units Free Power : తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ లు అమల్లో లోపాలున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇచ్చి, పై విద్యుత్ కు బిల్లు వేయాలని కోరారు.

గృహజ్యోతి పథకం

200 Units Free Power :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో గృహజ్యోతి (Gruha Jyothi Scheme)200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ స్కీమ్ ఒకటి. ఆరు గ్యారంటీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలె ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే పథకంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. నిరుపేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం అమలు చేసే విషయంలో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు.

201 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే

తెలంగాణలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి బిల్లు వసూలు చేయవద్దని...వారికి జీరో బిల్లు(Zero Bill) ఇస్తున్నారని హరీశ్ రావు అన్నారు. అయితే ఈ ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేవలం 200 యూనిట్ల(200 Units Free Power) వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్లు ఇస్తున్నారని తెలిపారు. కానీ ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే, మొత్తం 201 యూనిట్లకు బిల్లు వసూలు చేస్తున్నారన్నారు. వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. ఫ్యాన్ వేసుకోవాలా? వద్దా? లైట్ వేసుకోవాలా? వద్దా? అనేది మీటర్ రీడింగ్ చూసి నిర్ణయించుకోవాల్సిన దుస్థితికి పేదలను నెట్టడం బాధాకరం అన్నారు.

200 యూనిట్లు ఫ్రీ, పై యూనిట్లు బిల్లు

కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. 200 యూనిట్లు దాటితే, 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి, మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డులుంటే(White Ration Card), ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని నిర్ణయించారన్నారు. మిగతా వారికి నష్టం కలుగుతుందన్నారు. మొత్తంగా కేవలం మూడో వంతు పేదలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తున్నారని విమర్శించారు. రెండు వంతుల పేదలను విస్మరిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు.

రేషన్ కార్డు ప్రమాణికం సరికాదు

"ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒక రేషన్ కార్డు(Ration Card)లో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి బతుకుతున్నారు. వారు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో, వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింప చేస్తుంది. ఇది కూడా సరైన పద్ధతి కాదు. ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని కోరుతున్నాను. నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే, మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చేయాలి. అలా చేయని పక్షంలో ఈ పథకం కేవలం నామమాత్రంగానే మిగిలిపోతుంది. హామీల అమలుకు ప్రభుత్వమే తూట్లు పొడిచినట్లు అవుతుందనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. నిజంగా పేదలకు సాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, వెంటనే పై మూడు విషయాల్లో తక్షణం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను."- హరీశ్ రావు

సంబంధిత కథనం