హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ధరల షాక్ తగిలింది. మెట్రో సంస్థ టికెట్ ధరలను పెంచింది. ఛార్జీల్లో పెంపు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కు పెంచుతున్నట్లు మెట్రో ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రాంతాలను అనుసంధానిస్తూ మెట్రో నియమించారు. దీంతో ఉద్యోగ, వ్యాపారస్తులు సకాలంలో తమ కార్యకలాపాలు సాగించేందుకు ఎక్కువగా మెట్రో సేవలను వినియోగించుకుంటారు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, నాగోలు నుంచి రాయదుర్గం వరకు ప్రయాణించే ఈ మెట్రో రైలులో నిత్యం లక్షల మంది ప్రయాణిస్తుంటారు.
మెట్రో నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఛార్జీల పెంపు ప్రతిపాదన గతంలోనే రాగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో గతంలో ఛార్జీల పెంపు ప్రతిపాదనను మెట్రో రైలు విరమించుకుంది. అయితే హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు నష్టాలు పెరుగుతుండడంతో ఛార్జీల పెంపు అనివార్యమైందని యాజమాన్యం పేర్కొంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ మెట్రో రైలు భారీ నష్టాలతో నడుస్తుందని ఎల్ అండ్ టీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మే 10 తర్వాత మెట్రో ఛార్జీల పెంపు తప్పదని ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో భాగంగా మే 17 నుంచి ఈ ఛార్జీల పెంపు వర్తిస్తుందని మెట్రో తెలిపింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం అమలుచేస్తుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. మెట్రో రైలు నష్టాలకు ఇదొక కారణమని ఎల్ అండ్ టీ నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
సంబంధిత కథనం