రూ.19వేల కోట్ల అంచనాలతో హైదరాబాద్‌ మెట్రో మలిదశ విస్తరణ, ఖరారైన మెట్రో కొత్త రూట్లు ఇవే..-hyderabad metro expansion new metro routes estimated at rs 19 thousand crores ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రూ.19వేల కోట్ల అంచనాలతో హైదరాబాద్‌ మెట్రో మలిదశ విస్తరణ, ఖరారైన మెట్రో కొత్త రూట్లు ఇవే..

రూ.19వేల కోట్ల అంచనాలతో హైదరాబాద్‌ మెట్రో మలిదశ విస్తరణ, ఖరారైన మెట్రో కొత్త రూట్లు ఇవే..

Sarath Chandra.B HT Telugu

హైదరాబాద్‌ మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. నగర శివార్లకు మెట్రో సేవల్ని విస్తరించేలా ప్రణాళికలు రూపొందించారు. రూ. 19వేల కోట్ల అంచనాలతో జేబీఎస్‌-మేడ్చల్‌, జేబీఎస్‌-శామీర్‌పేట, శంసాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌-ఫ్యూచర్‌ సిటీ మార్గాల్లో మెట్రో నిర్మాణం చేపడతారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన హైదరాబాద్‌ మెట్రో మలిదశ డీపీఆర్‌

హైదరాబాద్ మెట్రో నగర శివార్లకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. మెట్రో రైల్‌ ప్రాజెక్టులో రెండోదశలో చేపట్టే మలివిడత కారిడార్‌ను ఖరారు చేవారు. రూ.19వేల కోట్ల అంచనాలతో ఈ కారిడార్ల నిర్మాణం చేపడతారు.

మెట్రో రెండో దశ చివరి విడత ప్రాజెక్టులో భాగంగా మూడు రూట్లలో 86.5 కి.మీ దూరంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో 1. జేబీఎస్-మేడ్చల్, 2.జేబీఎస్-శామీర్‌పేట, 3. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ -ప్యూచర్‌ సిటీ మార్గాలు ఉంటాయి.

మూడు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్ బోర్డు తెలిపింది. తాజాగా డీపీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. మంత్రి వర్గంలో ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపుతారు.

మలిదశ మెట్రోలో కీలక అంశాలు

హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు మలిదశ నిర్మాణంలో ఎక్కడా డబుల్ డెక్ రూట్‌లను ప్రతిపాదించలేదు. గతంలో జేబీఎస్-శామీర్ పేట, జేబీఎస్-మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ విధానంలో మెట్రో పిల్లర్లను వేయాలని భావించారు. ఈ విధానంలో ఒక అంతస్తులో రహదారి, రెండో అంతస్తులో మెట్రో నిర్మిం చాలని భావించినా స్టేషన్ల బాగా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో హెచ్ఎఎంఎల్ దానికి అంగీకరించలేదు.

  • జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, హకీంపేట, తూంకుంట, శామీర్‌ పేట వరకు 22 కి. మీ. మెట్రో మార్గాన్ని ప్రతి పాదించారు. హకీంపేట ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్ రన్వే రహదారి పక్కనే ఉండటంతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రక్షణ సంస్థ అభ్యంతరం తెలిపింది.
  • హకీంపేట ఎయిర్‌ పోర్ట్‌ పరిసరాల్లో సుమారు కిలోమీటరున్నర దూరం భూగర్భంలోంచి మెట్రోని ప్రతిపాదించారు. రన్వే కింద నుంచి మెట్రో వెళ్లేలా డిజైన్ చేశారు.

జేబీఎస్‌-మేడ్చల్‌ మార్గంలో…

  • జేబీఎస్ నుంచి తాడ్బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్‌ వెళ్లేందుకు 24.5 కి.మీ. మేర మెట్రోని ప్రతిపాదించారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు శామీర్‌పేట్‌ వైపు మెట్రో ట్రాక్‌లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతమున్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో నిర్మిస్తారు.
  • మెట్రో తాజా కారిడార్లలో నిర్మించే మూడు మార్గాలకు కూడలిగా జేబీఎస్‌ను అభివృద్ధి చేసేలా ఎలైన్ మెంట్‌ ఖరారు చేశారు.
  • శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్యూచర్‌సిటీ వరకు 40 కి.మీ. మార్గం ప్రతిపాదించారు. విమానాశ్రయంలో టర్మినల్ స్టేషన్ భూగర్భంలో నిర్మిస్తారు.
  • మెట్రో ప్రాజెక్టు రెండోదశలో పార్ట్‌ బీను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డీపీఆర్ రూపకల్పన చేశారు. అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, కేంద్ర ప్రభుత్వం 18 శాతం భరించాల్సి ఉంటుంది. 48 శాతం బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సమీకరిస్తారు. మిగిలిన 4 శాతం పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌లో సమకూర్చుకోవాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.