గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రా యాక్షన్- శ్రీధరరావుపై దేశ, విదేశాల నుంచి ఫిర్యాదులు-hyderabad hydra action on gachibowli sandhya convention encroachments complaints on sridhar rao ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రా యాక్షన్- శ్రీధరరావుపై దేశ, విదేశాల నుంచి ఫిర్యాదులు

గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రా యాక్షన్- శ్రీధరరావుపై దేశ, విదేశాల నుంచి ఫిర్యాదులు

గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ పై హైడ్రా క్రేన్ యాక్షన్ షురూ చేసింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఉద్యోగుల లే ఔట్‌లో సంధ్యా కన్వెన్షన్ య‌జ‌మాని శ్రీ‌ధ‌ర‌రావు ఆక్రమణలకు పాల్పప‌డ్డారని ఫిర్యాదు వెల్లువెత్తడంతో హైడ్రా చర్యలు చేపట్టింది.

గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రా యాక్షన్- శ్రీధరరావుపై దేశ, విదేశాల నుంచి ఫిర్యాదులు

హైదరాబాద్ లో మరోసారి హైడ్రా యాక్షన్ షురూ చేసింది. శేరిలింగంప‌ల్లి మండ‌లం గ‌చ్చిబౌలి మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న సంధ్యా క‌న్వెన్షన్ ఆక్రమణలు మంగ‌ళ‌వారం తొల‌గించింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లో సంధ్యా కన్వెన్షన్ య‌జ‌మాని శ్రీ‌ధ‌ర‌రావు ఆక్రమణలకు పాల్పప‌డ్డారని పెద్ద సంఖ్యలో హైడ్రా ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా చర్యలు చేపట్టింది.

162 ప్లాట్ల లేఔట్ ఆక్రమించి

అనుమ‌తి లేకుండా నిర్మించిన సంధ్యా క‌న్వెన్షన్ మిని హాల్‌తో పాటు.. ప్రధాన క‌న్వెన్షన్‌ను ఆనుకుని నిర్మించిన వంట గ‌దుల‌ను, 10 రెస్టు రూంల‌ను హైడ్రా తొల‌గించింది. అలాగే ఐర‌న్ పిల్లర్లతో జీ ప్లస్ 2గా నిర్మించిన రెండు క‌ట్టడాల‌ను కూడా కూల్చింది.

1980లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో 162 ప్లాట్లతో లే ఔట్ వేయ‌గా దాని నామ రూపాలు లేకుండా సంధ్యా క‌న్వెన్షన్ య‌జ‌మాని శ్రీ‌ధ‌ర్‌రావు చేశారంటూ హైడ్రా ప్రజావాణిలో ప‌లువురు ప్లాట్ య‌జ‌మానులు ఫిర్యాదు చేశారు.

లేఔట్ కబ్జా

సంధ్యా క‌న్వెన్షన్ పేరిట అడుగుపెట్టి పక్కనే ఉన్న తమ లే ఔట్‌ను క‌బ్జా చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. 'క‌ష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్ల చిరునామా లేకుండా..మొత్తం హ‌ద్దులను చెరిపేశారు. లే ఔట్‌లో ర‌హ‌దారులు, పార్కుల ఆన‌వాళ్లు లేకుండా ఆక్రమించేశారు.

ఇదేమ‌ని అడిగితే త‌మ‌పైనే దాడులు చేశారు. ఈ మోసాల‌ను త‌ట్టుకోలేక ప‌లువురు ఆత్మహ‌త్యలు కూడా చేసుకున్నారు. 30 వ‌ర‌కూ కేసులు శ్రీధరరావుపై ప‌లు పోలీసు స్టేష‌న్లో న‌మోద‌య్యాయి.

శ్రీధరరావు ఆక్రమణలు వెలుగులోకి

త‌మ లే ఔట్‌కు సంబంధించి కూడా 5కు పైగా కేసులు ఆయ‌న‌పై న‌మోద‌య్యాయి. హైడ్రా రావ‌డంతో మాకు ధైర్యంవ‌చ్చింది. మీరైనా చ‌ర్యలు తీసుకోండి' అని లే ఔట్‌లోని ప‌లువురు ప్లాట్ య‌జ‌మానుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. సంధ్యా క‌న్వెన్షన్ య‌జ‌మాని శ్రీ‌ధ‌రరావు ఆక్రమ‌‌ణ‌లు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా బ‌య‌ట‌ప‌డ్డాయని హైడ్రా తెలిపింది.

హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలను అధికారులు తొల‌గించారు. లే ఔట్ చుట్టూ నిర్మించిన ప్రహ‌రీతో పాటు ప‌లు ఆర్చిల‌ను కూల్చివేశారు.

శ్రీ‌ధ‌ర‌రావుపై కొన‌సాగుతున్న ఫిర్యాదులు

హైడ్రా చర్యలతో ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకున్న పలువురు ‌బాధితులు వివిధ మార్గాల్లో శ్రీధరరావుపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. న‌గ‌రంలో ఉన్న ‌వారే కాకుండా.. విదేశాల్లో ఉన్న వారు కూడా హైడ్రాకు ఆన్‌లైన్లో ఫిర్యాదు చేస్తున్నారు.

త‌మ‌ను లే ఔట్‌లోకి కూడా రానీయ‌కుండా అడ్డుకున్నార‌ని.. తమ ప్రమేయం లేకుండా డెవ‌ల‌ప్‌మెంట్ అగ్రిమెంట్లు రాయించుకుని నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని ప‌లువురు హైడ్రాకు ఫిర్యాదుచేశారు.

విదేశాల నుంచి ఫిర్యాదులు

విదేశాల నుంచి మెయిల్స్‌తో పాటు.. వీడియో రూపంలో బాధితులు తమ గోడును హైడ్రాకు చెబుతున్నారు. తమ ప్లాట్ లేదని శ్రీ‌ధ‌ర‌రావు మ‌నుషులు చెప్పడంతో త‌న భ‌ర్త ఆత్మహ‌త్య చేసుకున్నారంటూ దిల్లీ నుంచి ఓ మ‌హిళ ఆన్‌లైన్లో ఫిర్యాదు చేశారు. త్వరలో హైద‌రాబాద్ వ‌చ్చి హైడ్రా కార్యాల‌యంలో నేరుగా ఫిర్యాదు చేస్తానంటూ తెలిపారు.

ఒక్క ఫెర్టిలైజ‌ర్స్ కార్పరేష‌న్ ఉద్యోగుల లే ఔట్ వాళ్లే కాకుండా.. వేర్వేరు ప్రాంతాల్లో శ్రీ‌ధ‌రరావు చేసిన ఆక్రమణలపై ఫిర్యాదులందుతున్నాయని హైడ్రా తెలిపింది. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమించారని హైడ్రాకు ప‌లువురు ఫిర్యాదు చేస్తున్నారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం