Bhu Bharathi : సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా, 100 ఏళ్లపాటు నడిచే భూ భారతి వెబ్సైట్ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రత కోసం ఫైర్వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని అధికారులకు సూచించారు. జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భూ భారతి పథకంపై ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ భారతి వెబ్సైట్ సరళంగా, పారదర్శకంగా ఉండాలని, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా రూపొందించాలని సూచించారు.
రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు, లావాదేవీల సమాచారాన్ని రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందించేందుకు రూపొందిన భూ భారతి పోర్టల్ను ఏప్రిల్ 14(సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతో రూపొందించిన భూభారతి పోర్టల్ పై మంత్రి పొంగులేటితో శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు.
"భూ భారతి పైలట్ ప్రాజెక్ట్గా తెలంగాణలో మూడు మండలాలను ఎంపిక చేసి, వాటిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఈ సదస్సుల ద్వారా భూ భారతి పోర్టల్ గురించి రైతులు, ప్రజలకు సమగ్రంగా వివరించి, వారి సందేహాలను నివృత్తి చేయాలి. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలి. భూ భారతి పోర్టల్ సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలోనే ఉండాలి. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా దానిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి"- సీఎం రేవంత్ రెడ్డి
"సాంకేతికంగా బలమైన వెబ్సైట్, మొబైల్ యాప్లతో భూ భారతి పోర్టల్ను నిర్వహించాలి. భూ భారతి పోర్టల్ ప్రజలకు సేవలను సులభతరం చేయడంతో పాటు, వారి భూసంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో రూపొందింది కాబట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతరం మెరుగుపరచాలి" అని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
సంబంధిత కథనం