Etela Rajender : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జోరుగా చర్చ, ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
Etela Rajender : తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపై వస్తున్న ఊహాగానాలపై ఈటల రాజేందర్ స్పందించారు. అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.
Etela Rajender : పదవి కోసం బీజేపీలో చేరలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉంటారని, మార్పు ఉండకపోవచ్చన్నారు. తన సేవలు ఎక్కడ అవరమైతే అక్కడ ఉపయోగించుకుంటారన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్... పార్టీ తనకు ఏ బాధ్యత ఇవ్వాలో దిల్లీ నాయకత్వం చూసుకుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తమ శక్తిని ఇంకా పెంచుకోవాల్సిన ఉందన్నారు. దిల్లీ నాయకత్వంతో కూడా ఇదే భావిస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్తల బలం పెంచుకోవటంతో పాటు ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు బీజేపీలోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తున్న ఊహాగానాలు తప్పు అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
111 జీవో రద్దుతో జంట జలాశయాలకు ప్రమాదం
జీవో 111 లో ఉన్న భూములు ఆంధ్ర వ్యాపారులు కొల్లగొడుతున్నారని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు అభివృద్ధి పేరుతో రైతుల పొట్టగొడుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. 1908-1927 మధ్య కాలంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరానికి రెండు జలాశయాలు సాగు, తాగు నీరు అందించాయన్నారు. జీవో 111 రద్దుతో ఈ రెండు జలాశయాలకు ప్రమాదంలో పడ్డాయన్నారు. కేసీఆర్ మేధస్సుతో నిర్మించిన కాళేశ్వరం మోటర్లు చిన్న వరదలకే మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. 111 జీవో రద్దుతో రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. 1.32 లక్షల ఎకరాల్లో 18 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి మాటున భారీ కుట్ర ఉందని ఈటల విమర్శించారు.
పేదలకు సెంటు భూమి పంచలేదు
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి రైతుల కొంపలు ముంచిందన్నారు. ధరణి సమస్యలతో రైతులకు మరింత కష్టాల్లో కూరుకుపోయారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పేదలకు సెంటు భూమి ఇవ్వలేదని విమర్శించారు. రింగ్ రోడ్డు చుట్టు పక్కల ఉన్న దళిత రైతులకు చెందిన 5800 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఎకరాకు 300 గజాలు ఇచ్చి పేదల భూములను లాక్కున్నారన్నారు. ఎల్లమ్మ బండ భూములు, మియాపూర్ భూముల స్కామ్ ఎందుకు భయటపెట్టడంలేదని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఏడాదిలో నో ఛేంజ్
తెలంగాణలో ఈ ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ వార్తలు వచ్చిన కొన్నిరోజులకే బండి సంజయ్, ఈటల రాజేందర్ దిల్లీకి వెళ్లారు. అధిష్ఠానంతో చర్చలు కూడా జరిపారు. రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ విధి విధానాలు సహా కొన్ని అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ అధ్యక్షుడి మార్పు కష్టమని భావించిన అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమచారం. అందుకే బండి సంజయ్ నే అధ్యక్షుడిగా కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయించిందని తెలుస్తోంది.