ఓ ఆలయం ఎదుట హోటల్ నడుపుకుంటూ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో మనస్థాపానికి గురై వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝరాసంగానికి చెందిన బొందిల ప్రతాప్ సింగ్ (59), అతని భార్య కళావతి (54) దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. కొడుకు భార్యతో కలిసి వేరుగా ఉంటున్నాడు.
ప్రతాపసింగ్ దంపతులు కొన్నేళ్లుగా కేతకి సంగమేశ్వర ఆలయం ఎదుట హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా ఆ వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులతో ఆ దంపతులు సతమతమవుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య డబ్బుల విషయంలో తరచుగా గొడవలు పడుతుండేవారు.
దీంతో ప్రతాప్ సింగ్ తమ్ముడు సత్యనారాయణ పలుమార్లు నచ్చజెప్పాడు. మరల ఆదివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్థాపం చెందిన భార్యాభర్తలు ఆదివారం సాయంత్రం గ్రామశివారులో ఉన్న వారి పొలం వద్దకు వెళ్లారు. ఇద్దరు పురుగుల మందు తాగి సృహ తప్పి పడిపోయారు. రైతులు గమనించి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ప్రతాప్ సింగ్ కుటుంబసభ్యులు వెంటనే అక్కడికి చేరుకొని చికిత్స నిమిత్తం అంబులెన్సులో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు సత్యనారాయణ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాలువలోకి స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చలికి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగోలి గ్రామానికి చెందిన కమ్మరి గోపాల్ (20) జహీరాబాద్, పాస్తాపూర్ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గోపాల్ కూలీ పనులకు వచ్చిన డబ్బులతో నిత్యం మద్యం తాగుతూ ఖర్చు చేసేవాడు.
ఈ క్రమంలో గోపాల్ రెండు మూడు రోజులుగా పనికి వెళ్లడం లేదు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా అతని ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం చలికి పెద్ద చెరువులో గోపాల్ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన గ్రామస్థులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. స్నానానికి వెళ్లి గోపాల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.