'భూ భారతి' పోర్టల్ సేవలు - మీ భూమి వివరాలను ఇలా చెక్ చేసుకోండి-how to check land details on bhu bharati portal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'భూ భారతి' పోర్టల్ సేవలు - మీ భూమి వివరాలను ఇలా చెక్ చేసుకోండి

'భూ భారతి' పోర్టల్ సేవలు - మీ భూమి వివరాలను ఇలా చెక్ చేసుకోండి

రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుం భూ భారతి పోర్టల్ ఆధారంగానే సేవలు అందుతున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అమల్లోకి వస్తాయి. అయితే ఈ పోర్టల్ ఆధారంగా భూముల వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి....

భూ భారతి పోర్టల్

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. భూ భారతి చట్టంతో పాటు భూ భారతి పోర్టల్ కూడా ప్రారంభమైంది. భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. ఏప్రిల్ 14వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్ట్ గా నాలుగు మండలాల్లో మాత్రమే సేవలు ప్రారంభమయ్యాయి.

త్వరలోనే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో భూ భారతి సేవలు అందుబాటులోకి వస్తాయి. అయితే కొత్తగా వచ్చిన ఈ పోర్టల్ లో లావాదేవీ సేవలతో పాటు సమాచార సేవలు ఉన్నాయి. లావాదేవీల విభాగంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలతో పాటు ఇతర సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఇక సమాచార సేవల్లో చూస్తే భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. అయితే భూముల వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

భూ వివరాలను ఇలా చెక్ చేసుకోండి:

  • భూమి వివరాలు తెలుసుకునేందుకు ముందుగా భూ భారతి అధికారిక పోర్టల్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే సమాచార సేవల్లోకి వెళ్లాలి. ఇక్కడ భూ వివరాలు అనే ఆప్షన్ ఉంటుంది.
  • భూ వివరాల ఆప్షన్ పై క్లిక్ మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ సర్వే నెంబర్ లేదా పట్టాదారు పాస్ ఆధారంగా మీ భూమి వివరాలను తెలుసుకోవచ్చు.
  • సర్వే నెంబర్ తో చూసుకోవాలనుకుంటే జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోని చెక్ చేసుకోవచ్చు.
  • పట్టాదారుపాస్ పుస్తకంతో అయితే కేవలం పాస్ పుస్తకం నెంబర్ తో పాటు కింద ఉండే కోడ్ ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
  • ప్రింట్ ద్వారా భూ వివరాల కాపీని పొందవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి భూ వివరాలను నేరుగా తెలుసుకోవచ్చు….

ఇక భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని రూ. 300 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదారు పాసుపుస్తకం జారీ అవుతుంది. మ్యూటేషన్ దరఖాస్తు కోసం ఎకరానికి రూ. 2500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం గుంటకు రూ. 62.50 ఛార్జీ పడుతుంది.భూ హక్కులతో పాటు అధికారుల సమర్పించిన రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే అప్పీల్ కు వెళ్లొచ్చు. ఇందుకోసం రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

భూ యజమాని రికార్డుల్లో తప్పుల సవరణ దరఖాస్తు కోసం రూ. 1000 చెల్లించాలి. స్లాట్ బుకింగ్ ద్వారానే భూ భారతి పోర్టల్ లోనూ రిజిస్ట్రేషన్లు అవుతాయి. అయితే అనుకున్న సమయానికి రాకపోతే మార్పులు చేసుకునే వీలు ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం