ఆదిలాబాద్‌లో మండిన ఎండలు.. రానున్న మూడ్రోజుల్లో తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన-hot weather in adilabad light rain forecast for telangana in the next three days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఆదిలాబాద్‌లో మండిన ఎండలు.. రానున్న మూడ్రోజుల్లో తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన

ఆదిలాబాద్‌లో మండిన ఎండలు.. రానున్న మూడ్రోజుల్లో తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన

Sarath Chandra.B HT Telugu

ఆదిలాబాద్‌లో ఆదివారం భానుడి భగభగలతో చెలరేగిపోయాడు. ఉష్ణోగ్రతలు 43. 5 డిగ్రీలు నమోదయ్యాయి. నిజామాబాద్‌ 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

తెలంగాణలో పలు జిల్లాలకు నేడు, రేపు వర్ష సూచన (image source unsplash)

తెలంగాణలో రానున్న రెండు మూడు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.ఈశాన్య విదర్భ నుంచి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర- దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో దాని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అల్ప పీడన ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుండటంతో దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

తెలంగాణలోని 24 జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించింది.

ఆదివారం భగ్గుమన్న భానుడు..

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదైంది. ఆదివారం ఆదిలాబాద్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. మెదక్‌లో 23.8 డిగ్రీల సెల్సియస్ డిగ్రీలు నమోదైంది.

ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆదివారం ఆదిలాబాద్‌లో 43.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 43.1డిగ్రీలు, భద్రాచలంలో 39.4 డిగ్రీలు, దుండిగల్‌లో 38.7 డిగ్రీలు, హకీంపేటలో 38.5 డిగ్రీలు, హన్మకొండలో 40డిగ్రీలు, ఖమ్మంలో 40.4డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 40డిగ్రీలు, రామగుండంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం