జలమండలి సరఫరా చేసే నీటిని అక్రమంగా మోటార్లతో తోడుతున్న వారిపై జలమండలి అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండు రోజులుగా మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ పేరుతో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు.
బుధవారం నగరంలోని ఓ అండ్ ఎం డివిజన్ - 6, ఎస్ఆర్ నగర్ లోని మధురానగర్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతంలో లో-ప్రెషర్ తలెత్తుతున్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. కొంతమంది వినియోగదారుల ఇండ్లలో అక్రమంగా మోటార్లు వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఎండీ అశోక్ రెడ్డి ఓ హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్ళగా.. ఆ యజమాని తన నల్లాకు వ్యవసానికి వినియోగించే 2 హెచ్ పి మోటర్ తో నీటిని తోడడంతో యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది ఇళ్లకు సరిపడా నీటిని ఒక్కడే వాడితే మిగతా వాళ్ళు ఏమైపోవాలని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఆ హాస్టల్ కు నెలవరకు నీటిని నిలిపివేసి…. ట్యాంకర్ సైతం బుక్ చెయ్యకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇదే ప్రాంతంలో మరో భవనానికి సైతం వ్యవసాయ మోటార్ వాడుతూ పట్టుపడగా కనెక్షన్ తొలగించారు. నెల వరకు ట్యాంకర్ కూడా సరఫరా నిలిపివేయమని ఎండీ అధికారులకు సూచించారు. ఈ డ్రైవ్ ను ఎస్ ఆర్ నగర్ ప్రాంతంలో వారం పాటు కొనసాగించాలన్నారు.
ప్రతిరోజూ వాటర్ సప్లై సమయంలో తనిఖీ చేసి మోటార్లు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ డ్రైవ్ మరో 60 రోజుల వరకు నగరం అంతా కొనసాగుతుందని….. మోటార్లు బిగించి పట్టుబడితే మోటార్లు సీజ్ చేస్తారని స్పష్టం చేశారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని ఈ సందర్బంగా ఎండీ హెచ్చరించారు.
ఈ మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ లో జలమండలి ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించింది. హైదరాబాద్ నగరంలో లో ప్రెజర్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో నీటి వృథాను అరికట్టాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాలలో జలమండలి ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు పర్యటిస్తున్నారు. జలమండలి చర్యలపై లో ప్రెజర్ ఏరియా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.