Mellacheruvu Shivalayam: పెరిగే 'శివలింగం' గురించి తెలుసా? ఇక్కడి మహత్యం చూస్తే ఔరా అనాల్సిందే!
Maha Shivaratri 2023: పురాతమనమైన శివాలయం..! పైగా ఆలయంలోని శివలింగం పెరుగుతూ రావటం ఇక్కడి విశేషం..! అంతేకాదండోయ్ శివలింగం అగ్ర భాగంపై నీళ్లు ఉండటం ఇక్కడ మరో స్పెషల్..! ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న మేళ్లచెర్వు శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర ఆలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే.…..
Mellacheruvu Sri Swayambhu Shambhu Lingeswara Temple: మహాశివరాత్రి.... హిందువుల పండగల్లో అతి ముఖ్యమైనది. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి... మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిదర పోకుండా (జాగరణ) తో మేలుకొని భక్తిశ్రద్ధలతో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది. ఈ పండగ నేపథ్యంలో శివాలయాలన్నీ భక్తులతో నిండిపోతాయి. అందులోనూ పురాతమైన శివాలయాల వద్ద పరిస్థితిని చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వాటిల్లో ఒకటి ' శ్రీ శంభు లింగేశ్వర స్వామి టెంపుల్'. ఇది సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో ఉంటుంది. మరీ ఈ ఆలయ చరిత్రేంటి..? ఇక్కడి ప్రత్యేకలు... మహాశివరాత్రి వేళ చేపట్టే కార్యక్రమాలు ఎంటో చూద్దా......
ట్రెండింగ్ వార్తలు
కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెర్వు గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయం చాలా చరిత్రతో పాటు పురాతనమైనది. ఇక్కడి ఆలయ నిర్మాణం చూస్తే... కాకతీయ రాజవంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడి అద్భుత విశేషమేంటంటే... గర్భాలయంలోని శివలింగం ప్రతి 12 సంవత్సరాలకు(పుష్కరం) ఓసారి పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయాన్ని సందర్శిస్తే ఇందుకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లను కూడా చూపిస్తారు.
శివుడిపై నీళ్లు....
శివలింగం పెరగటమే కాదు... ఇక్కడ మరో వింత కూడా ఉంటుంది. శివలింగం అగ్ర భాగాన అంటే పైభాగన ఒక గుంటలాగా ఉంటుంది. ఆ గుంటలో నుంచి నీరు వస్తుంది. ఆ చోటు నుంచే పూజారులు నీరు తీసి భక్తులకు తీర్థంగా ఇస్తారు. అయితే ఇలా ఎన్నిసార్లు ఆ చిన్న గుంట నుండి నీళ్లు తీసినా... వెంటనే మళ్లీ నిండిపోవటం కనిపిస్తోంది. అంతేకాదు... ఆ గుంట నిండిపోయినప్పటికీ... నీరు అలా నిలిచిపోయి ఉంటుందే కానీ... కిందికి ఏ మాత్రం జారదు. వేసవి, శీతాకాలం ఇలా ఏ సమయమైనా... శివలింగంపై ఉండే నీటిలో ఏ మాత్రం తేడా ఉండదు. ఇదే ఆ స్వయంభు శివలింగం ప్రత్యేకత అని కూడా చెప్పొచ్చు. ఇక గుంటలో ఉండే నీటిని కూడా పూజారులు... దర్శనం సమయంలో అద్దం పెట్టి భక్తులకు చూపిస్తారు.
భారీగా ఉత్సవాలు...
ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా వైభవంగా జాతర నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ నెల 18 నుంచి జాతర ప్రారంభం కానుంది. వేకువజామున శివాలయంలో స్వామి వారికి అభిషేకాలతో జాతర మొదలుకానుంది. అదే రోజు సాయంత్రం ప్రభల ఊరేగింపు ఉంటుంది. రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తారు. ఇక 19న రాష్ట్ర స్థాయి ఎద్దుల పందేలు ప్రారంభమవుతాయి. 20న రథోత్సవం, 21న రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, 22న రాత్రి పవళింపు సేవ, బహుమతి ప్రదానోత్సవంతో జాతర ముగుస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. ఎద్దుల పోటీల్లో గెలుపొందిన వారికి ట్రాక్టర్లు, బైక్ లు బహుమానంగా ఇస్తారు.
సంబంధిత కథనం