హైదరాబాద్ పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణంలో చారిత్రక కట్టడాలకు నష్టం కలిగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం పురవాస్తు శాఖ గుర్తించిన కట్టడాలను కూల్చొద్దని ఆదేశించింది.
హైదరాబాద్ పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణంలో పురావస్తు కట్టడాలను కూల్చడంపై దాఖలైన పిల్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పాతబస్తీలో మెట్రో కారిడార్ ఏర్పాటులో భాగంగా పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారంటూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ హైకోర్టును ఆశ్రయించింది.
పురాతన కట్టడాలను కూల్చడం లేదని అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. మెట్రో కారిడార్ నిర్మాణంలో ఆర్కియాలజీ గుర్తించిన కట్టడాల జోలికి పోవద్దని ధర్మాసనం ఆదేశించింది. మెట్రో అలైన్మెంట్లో తొలగించే కట్టడాల వివరాలతో పూర్తి అఫిడవిట్ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేసు విచారణ ఏప్రిల్ 22కు వాయిదా పడింది.
హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో లైన్ నిర్మాణం కోసం కొద్ది రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఇళ్లను తొలగించే ప్రాంతంలో బాధితులకు పరిహారం చెల్లించి కట్టడాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో చారిత్రక కట్టడాలకు నష్టం కలుగుతోందని పిల్ దాఖలైంది.
సంబంధిత కథనం