ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఓవైపు ఎండల తీవ్రత ఉండగా… మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో… మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడనుండగా… మరికొన్నిచోట్ల భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ పేర్కొంది.
ఇవాళ తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 50 -6- కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మే 20వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో చాలా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ తర్వాత తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలోని ఇవాళ (శనివారం) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
విజయనగరం,మన్యం,అల్లూరి, ఏలూరు,పల్నాడు,ప్రకాశం,కర్నూలు, నంద్యాల,వైఎస్ఆర్,అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక విజయనగరం జిల్లాలోని 2 మండలాలతో పాటు మన్యం - 5,అల్లూరి - 2, తూర్పుగోదావరి జిల్లాలోని 1మండలాల్లో వడగాలులు వీచే అవకాశం అవకాశం ఉందని పేర్కొంది.