Karimnagar Rains: మూడు రోజులుగా ముసురులా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి నీళ్ళు చేరాయి. ప్రజలు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల దారులు ధ్వంసమై రాకపోకలు స్థంబించాయి. రోడ్లన్నీ బురదమయంగా మారి జనజీవనం అస్తవ్యస్తంగా మారి పలు చోట్ల జనం ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం పై మండిపడ్డారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు బురదమయంగా మారాయి. 25వ డివిజన్ లో పద్మావతి కాలనీలో రోడ్డుపై నీళ్ళు నిలిచి బురదమయంగా మారడంతో స్థానికులతోపాటు కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు బురద నీళ్లలో రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం రోడ్డు మంజూరై కౌన్సిల్ సమావేశంలో నిధులు కేటాయించినప్పటికీ రోడ్డు పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారులు, మేయర్ నిర్లక్ష్యంతోనే రోడ్డు పనులు జరగడం లేదని చిన్నపాటి వర్షానికి నడవలేని స్థితిలో దారి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టి కాలనీవాసుల ఇబ్బందులు తీర్చాలని లేనిచో మున్సిపల్ కార్యాలయాన్ని, కలెక్టరేట్ ను ముట్టడించేందుకు వెనుకాడమని హెచ్చరించారు.
అటు హుజూరాబాద్ డివిజన్ లో ఏకదాటిగా కురిసిన వర్షంతో చిలుక వాగు ఉప్పొంగి ప్రవహించింది. ఒడ్డెర కాలనీ, కనుకులగిద్ద, కందుగుల గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి నీళ్ళు చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. వేములవాడ సమీపంలో నక్క వాగు ఉధృతంగా ప్రవహిస్తుండతో రోడ్డు కోతకు గురై హనుమాజీపేట కు రాకపోకలు నిలిచిపోయాయి. మంథని మున్సిపాలిటీలోని బోయినిపేటలో వర్షానికి పురాతన ఇల్లు కూలింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 5.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మెట్ పల్లిలో 10.1 సెం.మీ.లు రాయికల్ లో 9.98 సెం.మీ.లు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లాలో సగటున 7 సెం.మీ.లు, కరీంనగర్ జిల్లాలో సగటున 5.25 సెం.మీ.లు, పెద్దపల్లి జిల్లాలో సగటున 4.29 సెం.మీ.లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సగటున 4.58 సెం.మీ.ల వర్షపాతం నమోదు అయింది.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో మానేరు డ్యామ్ లకు వరద క్రమంగా పెరిగింది. 24 టీఎంసీల నీటి సామర్థ్యం గల లోయర్ మానేరు డ్యాంలో 5.13 టీఎంసీలకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 771 క్యూసెక్కులుకాగ ఔట్ ఫ్లో 204 క్యూసెక్కులు ఉంది. మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 27టిఎంసీలు కాగా ప్రస్తుతం 5.61టిఎంసీలకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 525 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 62క్యూ సెక్కులు ఉంది.
ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు 36 క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చి చేరుతుంది. పలుచోట్ల చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. జలాశయాల్లోకి కొత్తనీరు వచ్చి చేరుతుండడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)