హైదరాబాద్‌ను వదలని వరుణుడు.. దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు!-heavy rain is lashing several parts of hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్‌ను వదలని వరుణుడు.. దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు!

హైదరాబాద్‌ను వదలని వరుణుడు.. దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు!

మండు వేసవిలో హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. మధ్యాహ్నం వరకు ఎండ మండుతోంది. సాయంత్రం అవ్వగానే వర్షం దంచుతోంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా.. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం (istockphoto)

హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొడుతోంది. ఈసీఐఎల్, కాప్రా, యాప్రాల్, అల్వాల్, నాగారం, దమ్మాయిగూడ, శామీర్‌పేట, మేడ్చల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నార్త్ హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని స్పష్టం చేశారు.

నిన్న కూడా..

ఏప్రిల్ 18న సాయంత్రం కురిసిన ఈ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, నానక్‌రామ్ గూడ, కోకాపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు కూడా వీచడంతో కొన్నిచోట్ల రేకుల షెడ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఈ ప్రాంతాలు జలమయం..

టోలీచౌకి, షేక్ పేట, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, నానల్ నగర్, లంగర్ హౌజ్, గోల్కొండ, పాతబస్తీ, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, రాజ్ భవన్ రోడ్, లక్డీకాపూల్, పంజాగుట్ట, సోమాజిగూడ, ప్రకాష్ నగర్, మెట్టుగూడ, ఉప్పల్, సికింద్రాబాద్, రాణిగంజ్, నాంపల్లి, కోటి, అబిడ్స్, మొజాంజాహీ మార్కెట్, అఫ్జల్ గంజ్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.

జిల్లాల్లోనూ..

ఇటు జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, మొదక్, వికారాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం కురుస్తోంది. అలాగే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. చాలాచోట్ల గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ సమయంలో విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్ల కింద ప్రజలు ఉండొద్దని అధికారులు సూచించారు. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని స్పష్టం చేశారు.

సంబంధిత కథనం