తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ నివాసం నుంచి విడుదల చేశారు. ఈసారి అభ్యర్థుల సెల్ఫోన్లకు నేరుగా ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్లో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన భరత్ చంద్ర మొదటి ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో హైదరాబాద్కు చెందిన సాకేత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. అయితే.. ఇంటి నుంచే ఫలితాలను విడుదల చేయడంపై మాజీమంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. సీఎంపై విమర్శలు గుప్పించారు.
'ఈఏపీసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈఏపీసెట్ ఫలితాలను.. తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి విడుదల చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంభావం, పాలన మీద, విద్యార్థుల మీద ఉన్న చులకన భావాన్ని తెలియజేస్తుంది' అని హరీష్ రావు విమర్శించారు.
'ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో.. పోటీ పరీక్షల ఫలితాలను తమ ఇంటి నుంచి విడుదల చేయలేదు. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి.. లేకపోతే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పాలన కొనసాగించే ఈ ముఖ్యమంత్రి.. అటు పోలీసులను పని చేసుకోనివ్వడం లేదు. ఇటు అధికారులను పని చేయనివ్వడం లేదు. సెక్రటేరియట్ మొఖం చూడడం లేదు. ప్రజా పాలన అంటే ఇదేనా?' అని హరీష్ ప్రశ్నించారు.
ఈసారి ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,07, 190 మంది పరీక్షలు రాశారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా.. ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా.. 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా.. బాలురది 72.79 శాతంగా నమోదైంది. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే.. మొత్తం 81,198 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 71, 309 మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది 87.82 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో బాలికలు 88.32 శాతం, బాలురు 86.29 శాతం ఉన్నారు.
సంబంధిత కథనం