తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా ఏపీ ప్రభుత్వం జలదోపిడికి సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్ రావ్ ఆరోపించారు. గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే… తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఏపీలో తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ కు ఎలాంటి అనుమతులు లేవని హరీశ్ రావ్ చెప్పారు. రూ. 80 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు, మిగతా 50 శాతం ఎఫ్ఆర్బీఎం పరిధి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయం, అనైతికమన్నారు. విభజన చట్టం ప్రకారం… కృష్ణా లేదా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమని గుర్తు చేశారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని హరీెశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏపీని అడ్డుకోవాల్సిన కేంద్రం… నిధులిచ్చి సహకరించడం దుర్మార్గమన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయమ్నారు.
“ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుంటే, ఎఫ్ఆర్బీఎం కింద రికవరీ పెట్టారు. కానీ బనకచర్ల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా 50శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితి మించి రుణం తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ, ఆంధ్రప్రదేశ్ పై వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా” అని హరీశ్ రావ్ నిలదీశారు.
“నాడు సమైక్య పాలకులు పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాల అక్రమ తరలింపునకు ప్రణాళిక వేశారు. నేటి కాంగ్రెస్ నాయకుల సమక్షంలోనే బనకచర్ల ద్వారా గోదావరి జలాల దోపిడికి మార్గం సుగమం చేస్తున్నారు. కేంద్రాన్ని నిలదీయలేరు, ఏపీతో పోరాటం చేయలేరు. చేతగాని ప్రభుత్వం వల్ల తెలంగాణ నష్టపోయే పరిస్థితి వచ్చింది” అని హరీశ్ రావ్ ఓ ప్రకటన ద్వారా విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయన్నారు. నీతి అయోగ్ సమావేశానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. ఏపీ అక్రమ ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించాలన్నారు. ఏపీ జల దోపిడిని అడ్డుకోవాలని హరీశ్ రావ్ డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం