కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నదని.. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ. 800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో.. 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచడంలో పడిందన్నారు. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం.. పాలనా వైఫల్యానికి నిదర్శనం అని విమర్శించారు.
'సకాలంలో పరీక్ష నిర్వహించకపోవడంతో పీజీసెట్, లా సెట్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి మూడో సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారు. ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను.. కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగాని తనమే. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా నిరసనలు తెలుపుతున్నప్పటికీ.. ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నది' అని హరీష్ ధ్వజమెత్తారు.
'ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి. అద్దెలు, అప్పులు పెరిగిపోవడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లను నిలిపివేయగా.. కొన్నిచోట్ల కళాశాలలకు తాళం వేసి ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టనట్లు సీఎం, మంత్రులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు' అని మాజీమంత్రి విమర్శించారు.
'విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దివంగత సీఎం వైఎస్ ప్రారంభించిన పథకాన్ని.. ఎలాంటి మార్పు లేకుండా కేసీఆర్ అమలు చేశారు. గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలం సహా.. ఏనాడు బకాయిలు ఆపలేదు. ప్రతి ఏటా సగటున రెండు వేల కోట్లు, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం రూ.19,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేశాము. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 17 నెలల్లో 17 పైసలు కూడా విడుదల చేయలేదు' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
'ఈ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో విద్య అనేది మిథ్య అని స్పష్టమవుతున్నది. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో పెట్టారు. దానికి అతి గతి లేదు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పి.. మరుగున పడేలా చేశారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలే అయ్యాయి' అని హరీష్ విమర్శలు గుప్పించారు.
'రెండు నెలల్లో మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని, కళాశాల యాజమాన్యాలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలే అయ్యాయి. మాటమీద నిలబడేది లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరిదీ అదే దారి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ఈ రేవంత్ అన్న బాధ్యత అంటూ.. స్పీచులు దంచే సీఎం ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు?' అని సిద్ధిపేట ఎమ్మెల్యే నిలదీశారు.
'విద్యార్థుల పరీక్ష ఫీజులు కూడా చెల్లించని దారుణమైన స్థితిలో మీ ప్రభుత్వం ఉందా? మీ 17 నెలల పాలనలో సంక్షేమ హాస్టళ్లకు తాళాలు పడ్డాయి. డిగ్రీ కళాశాలలకు తాళాలు పడ్డాయి. మెడికల్ కాలేజీలకు తాళాలు పడ్డాయి. ఇక గురుకులాలది దీన గాథ. ఏడాదిన్నర పాలనలో విద్యావ్యవస్థలో తెచ్చిన కాంగ్రెస్ మార్కు మార్పు ఇది. ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి. తక్షణం డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలు అంధకారం కాకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం' అని హరీష్ రావు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం