రేవంత్ రెడ్డికి చంద్రబాబును నిలదీసే దమ్ము లేదు.. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదని.. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి చంద్రబాబు అక్రమంగా నీళ్లు తరలించుకుంటున్నారని ఆరోపించారు. సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించి నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు తీర్మానం అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం చేతగానితనం వల్ల తెలంగాణకు నీటి విషయంలో మోసం జరుగుతుందని.. హరీష్ రావు విమర్శించారు.
'తెలంగాణకు బీఆర్ఎస్ నీళ్లు మళ్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక నీళ్లు నములుతోంది. ఏపీ నీళ్లు తీసుకుపోతున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. నాగార్జునసాగర్ను కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎందుకు ఆధీనంలోకి తీసుకోవడం లేదు. రేవంత్ విపక్షాలపై ఎగిరిపడటం కాదు.. ఏపీ ప్రభుత్వం, కేంద్రంపై ఎగిరిపడాలి. 666 టీఎంసీలకు 657 టీఎంసీల నీటిని.. ఏపీ ఇప్పటికే వినియోగించుకుంది. 123 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ శ్రీశైలం, సాగర్లో ఉన్నది.. కేవలం 100 టీఎంసీలు మాత్రమే' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
'తెలంగాణకు నీళ్లు లేకున్నా ఆంధ్రాకు నీళ్లు ఉంటే చాలు అనుకుంటున్నారా.. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్లు తీసుకపోతుంటే రేవంత్ రెడ్డి చూసుకుంటూ కూర్చున్నారు. తెలంగాణకు 123, ఆంధ్రాకు 9 టీఎంసీల నీళ్లు.. మొత్తం కలిపి 132 టీఎంసీలు కావాలి. కానీ నాగార్జునసాగర్, శ్రీశైలంలో కలిపి 100 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకుపోతుంది. మనకు రావాల్సిన మిగితా నీళ్లు ఎక్కడి నుండి తెస్తారు రేవంత్ రెడ్డి' అని హరీష్ రావు ప్రశ్నించారు.
ఒప్పందం ప్రకారం 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో.. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే కేటాయించాలి అని ఇటీవల మంత్రి ఉత్తమ్ వివరించారు. కేవలం 299 టీఎంసీలకు అంగీకరించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ దెబ్బతీశారని, కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయమైన నీటి హక్కులను కాపాడటంలో విఫలమయ్యారని ఆరోపించారు.