Hanamkonda Accident : ఓరుగల్లులో మరో రోడ్డు ప్రమాదం- ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్ వాహనం, ముగ్గురికి తీవ్రగాయాలు-hanamkonda road accident tata ace with labour dashed with rtc bus three injured ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hanamkonda Accident : ఓరుగల్లులో మరో రోడ్డు ప్రమాదం- ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్ వాహనం, ముగ్గురికి తీవ్రగాయాలు

Hanamkonda Accident : ఓరుగల్లులో మరో రోడ్డు ప్రమాదం- ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్ వాహనం, ముగ్గురికి తీవ్రగాయాలు

HT Telugu Desk HT Telugu

Hanamkonda Accident : హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

ఓరుగల్లులో మరో రోడ్డు ప్రమాదం- ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్ వాహనం, ముగ్గురికి తీవ్రగాయాలు

Hanamkonda Accident : వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఖమ్మం హైవేపై జరిగిన లారీ ప్రమాదం మరువక ముందే హనుమకొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం, హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనంలో ఉన్న కూలీలకు గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్థానికుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం చింతగట్టు, మునిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 24 మంది మహిళలు కూలి పని కోసం కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి వచ్చారు. ఉదయం 7 గంటల వరకే ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

గ్రామానికి చెందిన ఓ టాటా ఏస్ వాహనం మాట్లాడుకుని వంగపల్లికి చేరుకున్నారు. కూలి పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో టాటా ఏస్ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. వంగపల్లి నుంచి గూడూరు, అంబాల మీదుగా హసన్ పర్తి వెళ్లాల్సి ఉండగా.. ఈ మేరకు టాటా ఏస్ డ్రైవర్ కూలీలను ఎక్కించుకుని బయలు దేరారు.

ఎదురెదురుగా ఢీ.. ముగ్గురు సీరియస్

కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం వంగపల్లి నుంచి బయలు దేరింది. హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకుని కమలాపూర్ కు వస్తోంది. ఈ క్రమంలో టాటా ఏస్ వాహనం, ఆర్టీసీ బస్సు గూడూరు శివారుకు చేరుకోగా.. టాటా ఏస్ కు ఎదురుగా ఇంకో బైక్ వచ్చింది. దీంతో దానిని తప్పించబోయిన టాటా ఏస్ డ్రైవర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. దీంతో టాటా ఏస్ వాహనం బోల్తా పడగా.. అందులో ఉన్న కూలీలు ఎగిరి పడ్డారు.

అందులో మొత్తం 24 మంది ఉండగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మిగతా వాళ్లు స్వల్ప గాయాలతో బయట పడగా, స్థానికులు గమనించి సహాయ చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్న కమలాపూర్ సీఐ హరికృష్ణ సహాయక చర్యలు చేపట్టారు. 108 అంబులెన్స్ లో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఓవర్ లోడ్ కూడా కారణమే

టాటా ఏస్ వాహనం అదుపు తప్పడానికి ఓవర్ లోడ్ కూడా కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గూడ్స్ వెహికిల్ ను నిబంధనలకు విరుద్ధంగా ప్యాసింజర్ సేవలకు వినియోగిస్తుండటంతో పాటు పరిమితికి మించి కూలీలను ఎక్కించడం వల్ల వాహనం అదుపు తప్పి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఓవర్ లోడ్ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతుండగా.. నిబంధనలు పాటించని వెహికిల్స్ పై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)