TS Budget session: గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు.. పిటిషన్ వెనక్కి
తెలంగాణ గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య బడ్జెట్ సమావేశాల నిర్వహణలో ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగించింది. గవర్నర్ రాష్ట్ర బడ్జెట్ ఆమోదించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. తిరిగి పిటిషన్ వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఇరుపక్షాల న్యాయవాదులు చర్చించి ప్రతిష్ఠంభనకు తెరదించారు.
బడ్జెట్ను ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. హైకోర్టు చేసిన సూచనల మేరకు ప్రభుత్వ, గవర్నర్ న్యాయవాదులు చర్చించి సమస్యను పరిష్కరించారు. రాజ్యాంగబద్ధ విధులను పాటిస్తామని ఇరుపక్షాలూ హైకోర్టుకు నివేదించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుష్యత్ దవే హైకోర్టుకు నివేదించారు. ఇక బడ్జెట్ ఆమోదానికి గవర్నర్ నిర్ణయించారని గవర్నర్ తరపు న్యాయవాది అశోక్ ఆనంద్ నివేదించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన పిటిషన్ వెనక్కి తీసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
గత ఏడాది బడ్జెట్ సమయంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అప్పటి నుంచి ప్రోటోకాల్ సహా విభిన్న అంశాల నేపథ్యంలో అటు గవర్నర్కు, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇక తాజాగా గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో కోర్టులో పిటిషన్ దాఖలైంది. గణతంత్ర దినోత్సవాలను జరపాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కాపీలను గవర్నర్కు పంపింది. కానీ గవర్నర్ బడ్జెట్ను ఆమోదించలేదు. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు సూచలన మేరకు ప్రతిష్ఠంభన వీడడంతో ఫిబ్రవరి 3న గవర్నర్ ప్రసంగం, ఫిబ్రవరి 6న బడ్జెట్ సమర్పణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
టాపిక్