MLA Rajasingh : పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్
MLA Rajasingh : తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రాతపూర్వకంగా డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు మెుదలుపెట్టలేదని చెప్పారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) హైదరాబాద్ పోలీసులు లక్ష్యంగా ఓ ట్వీట్ చేశారు. తాను ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డీజీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు మెుదలుపెట్టలేదని తెలిపారు. ఒక ఎమ్మెల్యేను చంపుతామని బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నందున ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
తనకు ఎనిమిది నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. పాకిస్థాన్(Pakistan) నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అనేక సార్లు ఫిర్యాదు చేసినా.. ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేయలేదని రాజాసింగ్ తెలిపారు. జై శ్రీరామ్(Jai Sriram) అన్న ప్రతిసారీ తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసే పోలీసులు.. ఇప్పుడు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. తనకు గన్ లైసెన్స్ కోసం ఇప్పటికే చాలా సార్లు అభ్యర్థన పెట్టుకున్నానని చెప్పారు.
'నిజంగా ఆశ్చర్యకరం. సిట్టింగ్ ఎమ్మెల్యే పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ ఎదుర్కొంటుంటే హైదరాబాద్(Hyderabad) పోలీసులు పట్టించుకోవడం లేదు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. నేను జై శ్రీరామ్ అని ఒక్క ట్వీట్ చేసినా, హిందువులకు మద్దతుగా నా గొంతు విప్పినా కేసులు పెట్టి చర్యలు తీసుకొంటారు పోలీసులు. ఇప్పుడు మాత్రం అస్సలు స్పందించడం లేదు. స్పందించేందుకు మీకు ఏం అడ్డు వస్తోంది.' అని రాజాసింగ్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వం నుంచి మాత్రం.. ఎలాంటి స్పందన లేదని రాజాసింగ్ తెలిపారు. తనపై కేసులు ఉన్నాయని గన్ లైసెన్స్ ఇవ్వడం లేదన్నారు. అయితే కేసులు ఉన్నా.. గన్ లైసెన్స్ పొందిన వ్యక్తులు ఉన్నారని రాజాసింగ్ చెప్పారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నా.. గన్ లైసెన్స్ ఇవ్వకపోవడం దారుణమని రాజాసింగ్ మండిపడ్డారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిబ్రవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. తనకు కొన్ని నెంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్, వాట్సాప్ లలో సందేశాలు వస్తున్నాయని ఫిర్యాదులో చెప్పారు. తనకు వచ్చే బెదిరింపు కాల్స్ ఫోన్ నెంబర్లను కూడా పేర్కొన్నారు.