Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక-ghmc warns people not to come out in view of heavy rain in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక

Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక

Hyderabad Rains : హైదరాబాద్‌ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నానికి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిస్తోంది. అకాల వర్షాల కారణంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. టోలిచౌకి, రాజేంద్రనగర్, షేక్‌పేట్, శంషాబాద్ ఏరియాల్లోనూ ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీని వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బయటకు రావద్దు..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న కొన్ని గంటల్లోనూ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ వాన పడింది. వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మెదక్, రంగారెడ్డి, యాదాద్రిలలో వర్షాలు కురిశాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

ఏప్రిల్ 16 నుండి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 17 నుండి 20 వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను కూడా దాటే అవకాశం ఉంది.

జాగ్రత్తలు ఇవీ..

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంట్లో ఉంటేనే మేలు. తగినంత నీరు తాగాలి. వదులుగా ఉండే, లేత రంగు దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా గొడుగును తీసుకెళ్లాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

సాయంగా రూ.4 లక్షలు..

తీవ్రమైన ఎండలు, వడగాలులు, వడదెబ్బ వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆదుకోవడానికి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే.. గతంలో రూ.50 వేలు సాయం చేసేవారు. ఆ ఎక్స్‌గ్రేషియాను రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచింది రేవంత్ సర్కార్‌.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం