Armoor Turmeric : ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపునకు జీఐ ట్యాగ్‌.. లాభాలు ఏంటీ?-geographical identification for turmeric grown in the armoor area ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Armoor Turmeric : ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపునకు జీఐ ట్యాగ్‌.. లాభాలు ఏంటీ?

Armoor Turmeric : ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపునకు జీఐ ట్యాగ్‌.. లాభాలు ఏంటీ?

Basani Shiva Kumar HT Telugu
Jan 23, 2025 04:14 PM IST

Armoor Turmeric : నిజామాబాద్‌ జిల్లా.. పసుపు పంటకు మారు పేరు. ముఖ్యంగా ఆర్మూర్‌ ప్రాంతంలో పసుపు పంట చాలా ఫేమస్. ఇక్కడే సాగుచేసే పసుపునకు భౌగోళిక గుర్తింపు సాధించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తల బృందం క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్మూర్‌ పసుపు
ఆర్మూర్‌ పసుపు

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఏరియాలో పండే పసుపునకు భౌగోళిక గుర్తింపు సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్ పసుపునకు భౌగోళిక గుర్తింపు కోసం శాస్త్రవేత్తల బృందం క్షేత్ర స్థాయిలో అధ్యయనం నిర్వహించింది. ఆర్మూరు ప్రాంతంలో చాలా ఏళ్లుగా రైతులు పసుపు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పసుపు ప్రధాన పంటగా ఉంది. అంతేకాదు.. అనేక ప్రత్యేకతలు ఇక్కడ పండే పసుపు సొంతం.

జీఐ ట్యాగింగ్ కోసం..

ఎంతో విశిష్టత కలిగిన ఆర్మూరు పసుపు రకానికి జీఐ ట్యాగ్‌ కోసం.. నాబార్డు సహకారంతో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. సైంటిస్టుల బృందానికి కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం నుంచి.. ఆర్మూర్ పసుపు ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకులుగా ఉన్న సైదయ్య నేతృత్వం వహించారు. శాస్త్రవేత్తలు బి మహేందర్, పి శ్రీనివాస్, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు.

వివరాల సేకరణ..

ఆర్మూరు పసుపునకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని శాస్ర్తవేత్తలు సేకరించారు. వాతావరణ పరిస్థితులు, నేల లక్షణాలు, ఆర్మూర్ పసుపు సాగు చరిత్ర, ప్రత్యేక లక్షణాలు, డాక్యుమెంటరీ ఆధారాలు, ఇతర అంశాలపై వివరాలు సేకరించారు. ఈ ప్రాంతంలో పసుపు పండించే చేలను సందర్శించారు. సాగుచేస్తున్న పసుపు రకాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.

లాభాలు ఏంటీ..

ఇక్కడి పసుపునకు భౌగోళిక గుర్తింపు వస్తే.. ఎగుమతులు పెరుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ రకానికి మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయని, అధిక ధరలు లభిస్తాయని అంటున్నారు. త్వరలోనే పసుపు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌, నమునాలను పరిశీలించి అధ్యయనం చేయనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. భౌగోళిక గుర్తింపు కోసం చెన్నైలో ప్రధాన కార్యాలయం ఉన్న మేధో సంపత్తి హక్కుల కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగు నెలల్లో ఆర్మూరు పసుపునకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేస్తామని సైదయ్య స్పష్టం చేశారు.

Whats_app_banner