Genome Valley : మరో 250 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ విస్తరణ - మంత్రి కేటీఆర్
Minister KTR News: మరో 250 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు. ఈ విషయాన్ని ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గర్వంగా చెప్పగలనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Minister KTR On Genome Valley: దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో బీఎస్వీ కంపెనీ కొత్త యూనిట్కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారత్ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఫేజ్-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ సందర్భంగా ప్రకటించారు.
ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఫేజ్-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ సందర్భంగా ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి అన్నారు.. ఎక్కడా లేనంత వేగంగా పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనడం నిర్వివాదమని పేర్కొన్నారు.
“మాకు కేంద్ర ప్రభుత్వానికి పడదు.. తెల్లారిలేస్తే మేమూ, వాళ్లూ తిట్టుకుంటాం.. విమర్శలు చేసుకుంటాం. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎప్పుడు ఏదో పంచాయితీ నడుస్తూనే ఉంటుంది.. అయినప్పటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్లో నంబర్వన్ ఎవరని అడిగితే తెలంగాణ అని వాళ్లు కూడా ఒప్పుకునే పరిస్థితిని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు.తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్వన్గా నిలిచింది. దేశ సగటు తలసరి ఆదాయం 1,49,000 ఉండగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,000గా ఉందని” మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని… ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 50 శాతం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి నిపుణులైన యువకులు ఉండటం, వాళ్లను చూసి కంపెనీలు ఇక్కడికి రావడం, వారికి ప్రభుత్వం సహకరించడమే కారణమన్నారు.