జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్లో శనివారం సాయంత్రం తర్వాత దారుణం వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటూ 5 ఏళ్ల హితక్ష కనిపించకుండా పోయింది. చుట్టుపక్కన ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కాసేపటికే అదే కాలనీలోని ఓ ఇంట్లోని బాత్ రూములో రక్తపు మడుగుల్లో పడి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాథమిక వివరాల ప్రకారం….. ఆదర్శనగర్ కాలనీకి చెందిన ఆకుల రాము-నవీన దంపతులకు ఇద్దరు సంతానం. రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. నవీన పిల్లలతోపాటు ఇక్కడే ఉంటున్నారు. వీరి కూతురు హితీక్ష(5) శనివారం సాయంత్రం పాఠశాలకు నుంచి తిరిగొచ్చాక ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ తర్వాత ఇంటికి రాలేదు.
దీంతో అప్రమత్తమైన తల్లి… చుట్టపక్కల ప్రాంతంలో వెతికింది.సమాచారం తెలియకపోవటంతో…. స్థానిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు. అదే కాలనీలో నివసించే విజయ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని బాత్ రూమ్ లో బాలిక రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ… అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసులో విజయ్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా లోతుగా విచారణ జరుపుతున్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హితీక్ష హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసినట్లు సమాచారం. హితీక్ష హత్య కేసులో కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారి పిన్నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.