ప్యాసింజర్‌ రైల్లో మంటలు.. బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌లో గంటకు పైగా నిలిచిన రైలు..-fire in passenger train train stopped at bibinagar railway station for over an hour ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్యాసింజర్‌ రైల్లో మంటలు.. బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌లో గంటకు పైగా నిలిచిన రైలు..

ప్యాసింజర్‌ రైల్లో మంటలు.. బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌లో గంటకు పైగా నిలిచిన రైలు..

Sarath Chandra.B HT Telugu

ప్యాసింజర్‌ రైల్లో మంటలు రావడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు రైలును నిలిపివేసిన ఘటన బీబీ నగర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ ఘటనతో దాదాపు గంట సేపు రైలు నిలిచిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన మరో ఘటనలో నాలుగు అంతస్తుల భవనం కాలి బూడిదైంది.

ప్యాసింజర్ రైల్లో మంటలు.. నిలిచిపోయిన రైలు

ప్యాసింజర్‌ రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన ఘటన బీబీ నగర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళుతున్న పుష్‌ పుల్‌ ట్రైన్‌ అడుగు భాగంలో మంటలు చెలరేగాయి. రైలు కింద భాగంలో మంటల్ని గుర్తించిన ప్రయాణికులు బీబీ నగర్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.

రైలు దిగువన మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేశారు. రైలు కింద భాగంలో చెలరేగిన మంటల్ని సిబ్బంది ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో రైల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దానిని నిలిపివేశారు. దాదాపు గంటన్నరకు పైగా బీబీ నగర్‌ రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అఫ్ఝల్‌గంజ్‌లో భారీ ప్రమాదం…

హైదరాబాద్‌ అఫ‌్ఝల్‌ గంజ్‌ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. భవనం కింద భాగంలో పేపర్‌ ప్లేట్స్‌ తయారు చేసే కర్మాగారం ఉండగా పై భాగంలో భవన యాజమానితో పాటు మరికొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భవనం కింద భాగంలో చెలరేగిన మంటలు భవనం మొత్తాన్ని ఆక్రమించాయి.

అగ్ని ప్రమాదంతో భవనం పై భాగంలో నివాసం ఉంటున్న వారు అందులోనే చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో నాలుగు ఫైర్‌ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న చిన్నారులతో పాటు ఎనిమిది మందిని సురక్షితంగా రక్షించారు. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా కాలి బూడిదైంది. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం