Ts Budget Allocations : కేంద్రం తీరుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం… హరీష్ రావు-finance minister harish reddy introduced 2023 24 financial year budget in assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Finance Minister Harish Reddy Introduced 2023-24 Financial Year Budget In Assembly

Ts Budget Allocations : కేంద్రం తీరుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం… హరీష్ రావు

HT Telugu Desk HT Telugu
Feb 06, 2023 11:26 AM IST

TS Budget Allocations2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు.

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు

TS Budget Allocations తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని కోరినా కేంద్రం స్పందించలేదని ఆర్ధిక మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనా సవాళ్లను తట్టుకుని తెలంగాణ బలమైన ఆర్ధిక శక్తిగా నిలిచిందని చెప్పారు. సంక్షోభ సమయాల్లో సమర్థవంతమైన ఆర్ధిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఆర్ధిక పరిస్థితి దయనీయంగా ఉండేదని, జాతీయ సగటు వృద్ధి రేటు కంటే జిఎస్డీపీ వృద్ధి రేటు తక్కువగా ఉండేదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత 13.2 శాతానికి పెరిగిందని, జాతీయ వృద్ధిరేటుకంటే తెలంగాణలో గణనీయంగా పురోగతి సాధించినట్లు హరీష్‌ రావు చెప్పారు. 2017-18 నుంచి 21-22 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8శాతాన్ని తెలంగాణ నమోదు చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా జిఎస్డీపి వృద్ధిలో జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు చేస్తున్నట్లు చెప్పారు.

తలసరి ఆదాయంలో సైతం తెలంగాణ గణనీయమైన ప్రగతిని సాధించినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణలో 2013-14 ఆర్ధిక సంవత్సరంలో తలసరి ఆదాయం 1,12,162 రుపాయలు ఉంటే 2022-23లో రూ.3,17,115గా ఉందన్నారు. జాతీయ సగటు రూ.1,70,620 మాత్రమే ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఆర్ధిక ఆటంకాలు సృష్టిస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితిని రూ.53,970 రుపాయలుగా బడ్జెట్‌లో పొందుపరిచినా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.15వేల కోట్లకు కోత విధించిందని ఆరోపించారు. ఈ నిర్ణయం పూర్తిగా అసంబద్ధమైనదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం సెక్షన్‌ 94(1) ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లోను కేంద్ర ప్రబుత్వ పన్నుల రాయితీ ప్రకటించాల్సి ఉన్నా, రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం దెబ్బతీసిందని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1350 కోట్ల నిధులను విడుదల చేయలేదని చెప్పారు.

తెలంగాణలో వార్షిక బడ్జెట్‌ను రూ.2,90,396కోట్లుగా ప్రకటించారు. అందులో రెవిన్యూ వ్యయాన్ని రూ.2,11,685కోట్లుగా, మూల ధన వ్యయంగా రూ.37,525కోట్లను ప్రకటించారు. ️ వ్యవసాయానికి రూ. 26,931 కోట్లు️, నీటి పారుదల శాఖకు రూ.26,885 కోట్లు️, విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు,️ ఆసరా పెన్షన్ల కోసం రూ.12,000 కోట్లు,️ దళితబంధు కోసం రూ.17,700 కోట్లు,️ ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు, ️ ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233 కోట్లు, ️ బీసీ సంక్షేమం కోసం రూ.6229 కోట్లు️మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

IPL_Entry_Point