Mlc Elections: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదల, మొత్తం 3,55,159మంది ఓటర్లు
Mlc Elections: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదలైంది. పట్టభద్రుల ఓటర్లు 3,55,159 మంది కాగా టీచర్ ఓటర్లు 27,088 మందిగా తేలింది. కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లు 355159 మంది, టీచర్ ఓటర్లు 27088 మంది ఉన్నారు.

Mlc Elections: ఉత్తర తెలంగాణలో పట్టభద్రులు, టీచర్ ఓటర్ల సంఖ్య తేలింది. ఫైనల్ ఓటర్ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న జరగనున్న ఉత్తర తెలంగాణలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు మొత్తం 3,55,159 మంది ఉండగా అందులో 2,26,765 మంది పురుషులు, 128392 మంది మహిళలు, ఇద్దరు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని ప్రకటించారు.
ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 27088 మంది ఉండగా 16932 మంది పురుషులు, 10156 మంది మహిళలు ఉన్నారు. ఇదే జాబితాతో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటర్ల సంఖ్య క్రమంలో పట్టభద్రులకు సంబంధించి 499 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఓటర్లకు 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
అత్యధికంగా కరీంనగర్ లో...
పట్టభద్రులు, టీచర్ ల ఓటర్లలో కరీంనగర్ టాప్ లో నిలిచింది. ఓటరు నమోదులో రెండింటిలో కరీoనగర్ జిల్లా వారే ఎక్కువ మంది ఉన్నారు. పట్టభధ్రుల, టీచర్ల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 15 జిల్లాలుండగా పట్టభద్రుల ఓటరు నమోదులో కరీంనగర్ జిల్లాలో 71545 మంది అత్యధిక సంఖ్యలో ఓటరుగా నమోదు కాగా అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేవలం 2483 మంది మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవడం విశేషం.
ఉపాధ్యాయ ఓటరు నమోదులో సైతం కరీంనగర్ జిల్లాలో 4305 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 83 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. పట్టభద్రుల ఓటర్లలో కరీంనగర్ తర్వాత స్థానంలో జగిత్యాల జిల్లాలో 35281 మంది, సిద్దిపేట జిల్లాలో 32589 మంది ఓటర్లు ఉన్నారు.
టీచర్ల ఓటర్ లలో కరీంనగర్ తర్వాత 3751 మంది ఓటర్లతో నిజామాబాద్ జిల్లా రెండోస్థానం, 3212 మంది ఓటర్లతో సిద్దిపేట మూడో స్థానంలో ఉంది. ఇతర జిల్లాలో నమోదు అంతంత మాత్రమే. సాధారణ ఓటరు జాబితాలో మహిళల ఆధిక్యం ఉండగా ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పురుష సంఖ్యకు సగానికి ఉండటం గమనార్హం.
పెరిగిన ఓటర్లు....
ఈ ఏడాది సెప్టెంబరు 30న ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమై నవంబరు 6వ తేదీ వరకు కొనసాగింది. దీంతో పట్టభద్రులు 3,58,579 మంది ఓటును నమోదు చేసుకోగా, ఉపాధ్యాయులు 27,994 మంది ఓటును పొందడానికి ఉత్సాహాన్ని చూపించారు. తిరిగి నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు కొత్తగా నమోదుతో పాటు అభ్యంతరాలకు సమయం ఇవ్వడంతో కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి పలువురు ముందుకొచ్చారు.
పక్షం రోజుల వ్యవధిలో పట్టభద్రులవి 28,111 ధరఖాస్తులు కొత్తగా చేరగా.. ఉపాధ్యాయుల పరంగా అదనంగా 5,054 మంది ఆసక్తిని చూపించారు. దీంతో మొత్తంగా పట్టభద్రుల ఓటర్ల దరఖాస్తుల సంఖ్య 3,86,690కి చేరింది. ఉపాధ్యాయ ఓటర్ల దరఖాస్తుల సంఖ్య 33,048కి పెరిగింది. మలి విడతలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 10 నుంచి పరిశీలించగా చాలా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. పక్కాగా ఉన్న వాటిని మాత్రమే ఆమోదం తెలిపి తుది జాబితాను అధికారులు విడుదల చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం